కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న అసంక్రమిత వ్యాధులు
జిల్లాలో 32,947 మంది రక్తపోటు బాధితులు
15,311 మందికి షుగర్ వ్యాధి గుర్తింపు
బాధితులకు ఎన్సీడీ క్లినిక్ల ద్వారా వైద్య సేవలు
కామారెడ్డి, మే 28 : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ కారణంగా కామారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్) అసంక్రమిత వ్యాధుల సర్వేలో బీపీ (రక్తపోటు), షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య పెరుగుతూ వస్తుందని సర్వే నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చేపట్టిన సర్వే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంకా నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయ్యేనాటికి మరింతమంది పెరిగే ఆవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మనిషియాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్న పరిస్థితుల్లో శారీరక, మానసిక ఒత్తిళ్ల కారణంగా అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు.
కొన్ని రోగాలు సర్జరీలతో నయం అవుతుండగా, మరికొంత మందికి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాల్లో బీపీ, షుగర్ వ్యాధులు రోజురోజుకూ విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీర్ఘకాలిక రోగాలు వస్తే అవి మనుషులను విడిచిపెట్టవు. అందుకే ఈ దీర్ఘకాలిక వ్యాధులపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్) అసంక్రమిత వ్యాధుల సర్వే నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో ఎంతమంది షుగర్, బీపీ వ్యాధుల బారిన పడ్డారనే విషయంపై కొన్ని నెలలుగా సర్వే చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో 32,947 మంది రక్తపోటు, 15,311 మందికి షుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో వెల్లడైంది. షుగర్, బీపీ కలిగిన వారు 48,258 మందికి ఉన్నట్లు ఎన్సీడీ సర్వేలో తేలింది.
32,947 మందికి రక్తపోటు
కామారెడ్డి జిల్లాలో 32,947 మందికి (బీపీ) రక్తపోటు బాధితులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో తేలింది. గత ఏడాది ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర వ్యాధులపై సర్వే నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అసంక్రమిత వ్యాధులపై సర్వే కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 9,35,529 మంది జనాభా ఉండగా, 8,89,676 మందిని ఎన్రోల్ చేశారు. జిల్లా వ్యాప్తంగా శాతం సర్వే పూర్తయ్యింది. పట్టణ ప్రాంతాల్లోని దేవునిపల్లి పీహెచ్సీ , రాజీవ్ నగర్ అర్బన్ కేంద్రాల్లో అత్యధికంగా బీపీ, షుగర్ బాధితులు ఉన్నట్లు తేలింది. వీటితో పాటు మాచారెడ్డి, భిక్కనూర్, ఎర్రాపహాడ్, బీర్కూర్, నిజాంసాగర్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో అసంక్రమిత వ్యాధుల బాధితులు అధికంగా నమోదై ఉన్నారు.
ఎన్సీడీ క్లినిక్ల ద్వారా వైద్య సేవలు..
అసంక్రమిత వ్యాధులకు కామారెడ్డి జిల్లాలోని 21 పీహెచ్సీ, సీహెచ్సీ, యూపీహెచ్సీ, జనరల్ దవాఖానల్లో ఎన్సీడీ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. పీహెచ్సీలో ఒక స్టాఫ్ నర్సు, సీహెచ్సీలో ఇద్దరు స్టాఫ్ నర్సులు, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రభుత్వ దవాఖానల్లో నలుగురు చొప్పున ప్రత్యేకంగా స్టాఫ్ నర్సులను కేటాయించారు. వీరు ముఖ్యంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు తీవ్రత మేరకు క్లినిక్ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సర్వే ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన ప్రొఫైల్ను పొందుపరుస్తున్నారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో కొవిడ్ వ్యాక్సినేషన్, ఇతర వ్యాధుల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ప్రొఫైల్ను అన్లైన్లో పొందుపరుస్తున్నారు. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వేపూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కిట్ల రూపంలో మందుల పంపిణీకి చర్యలు తీసుకోబోతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత మందులను అందించడంతో పాటు ఏవిధంగా వాడాలి అనే విషయాన్ని కిట్లో పొందుపర్చనున్నారు.
ఉచితంగానే మందులు
సర్వేలో బీపీ, షుగర్ వ్యాధులు నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే చివరి దశకు చేరింది. మరో నెలరోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో బీపీ,షుగర్ వాధిగ్రస్తులకు మందుల కోసం కిట్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సెంటర్లలో మందులు అందిస్తున్నారు.
– లక్ష్మణ్సింగ్, డీఎంహెచ్వో, కామారెడ్డి