కామారెడ్డి వాసుల దశాబ్దాల కల నెరవేరింది. వచ్చే ఏడాది నుంచే ఇక్కడ వైద్య కళాశాల అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు కామారెడ్డి మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.
– కామారెడ్డి, ఏప్రిల్ 8
కామారెడ్డి, ఏప్రిల్ 8: కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది. అనుబంధ దవాఖానలో వసతులు ఉండడంతో ఎన్ఎంసీ, మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఏండ్ల తరబడి ఉన్న ఇక్కడి ప్రాంత ప్రజల కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డికి మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అందుబాటులోకి మరిన్ని వైద్యసేవలు..
కామారెడ్డి జిల్లాగా ఏర్పడడంతో ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కామారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో వైద్య కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 130 పడకలతో పాటు అదనంగా మరో వంద పడకలను రెండో అంతస్తులో ఏర్పాటు చేసేందుకు నిధులను మంజూరు చేసింది. పనులు వడివడిగా సాగుతున్నాయి. దేవునిపల్లి డిగ్రీ కాలేజీ వెనుక ఉన్న ఎంసీహెచ్ భవనంలో వంద పడకల మాతా శిశు దవాఖానతో పాటు పలు విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే 2023-24 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీట్ ఫలితాల ఆధారంగా సెప్టెంబర్ నెలలో కామారెడ్డి మెడికల్ కాలేజీలో వంద సీట్లను భర్తీ చేయనున్నారు. కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్లుగా డాక్టర్ సర్జా అడప్ప, ఎస్.జ్యోతిని ప్రభుత్వం నియమించింది. త్వరలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లు, స్పెషలిస్టులు, డాక్టర్లు, సిబ్బంది ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. కళాశాల ప్రారంభమైతే జిల్లావాసులకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో గంప గోవర్ధన్ను గెలిపిస్తే కామారెడ్డిని జిల్లా ఏర్పాటు చేస్తా’ అని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలకు ముఖ్య కూడలిగా ఉన్న కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందులో కామారెడ్డి కూడా ఉన్నది. ప్రస్తుతం కాలేజీ ఏర్పాటు కు అనుమతులు లభించడంతో జిల్లా ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అంటున్నారు.
త్వరలోనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీ..
ఆగస్టులో నిర్వహించే నీట్ అనంతరం సెప్టెంబర్ నెలలో కామారెడ్డి మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ భర్తీ చేస్తుంది. కాలే జీ ఏర్పాటుకు సంబంధించిన వసతులను ఇప్పటికే ఎన్ఎంసీ బృందం మూడు సార్లు పర్యటించి పరిశీలించింది. పనులన్నీ పూర్తి కావస్తున్నాయి. సిబ్బందిని నియమించి వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
– పెరుగు వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, కామారెడ్డి మెడికల్ కాలేజీ