నిజాంసాగర్, మార్చి 24: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని, ఇప్పటి వరకు ఆరు విడుతల్లో 9.16 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.చివరి ఆయకట్టు పంటలు చాలా వరకు చేతికి అందడంతో ప్రస్తుతం ఏడో విడుత నీటిని డిస్ట్ట్రిబ్యూటరీ ఒకటి నుంచి 39 వరకు విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 13 94.00 అడుగుల (6.17 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యుసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటి విడుదల ఈనెల 31 వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.