నిజామాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పచ్చదనంతో పరుచుకున్న పరిసరాలు, పూలమొక్కల వరుసలు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్ఈడీ లైట్లు, యూపీవీసీ కిటికీలు, ‘జీప్లస్ వన్’ రీతిలో ఆకట్టుకునే హైఎండ్ డిజైన్డ్ ఇండ్లు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ. కంటికి కనిపించని విద్యుత్ తీగలు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా భవన సముదాయం. ఇవేవో హైదరాబాద్లో కోట్లు విలువచేసే విలాసవంతమైన విల్లాలు కావు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు. కామారెడ్డి నియోజకవర్గంలోని జంగంపల్లి, జనగామ గ్రామాల్లో నిర్మిస్తున్న ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న నిధులకు తోడుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చొరవతో అత్యాధునికంగా ఈ డబుల్ ఇండ్లు రూపుదిద్దుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గంప కోరిక మేరకు కాంట్రాక్టర్ సుభాష్రెడ్డి మొత్తం 102 ఇండ్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు వారు చెబుతున్నారు.
రూ.లక్షన్నర అదనపు భారం..
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపు మేరకు డబుల్ ఇండ్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన సుభాష్రెడ్డి.. ప్రతి ఇంటిపై అదనంగా రూ.లక్షన్నర వెచ్చించారు. సర్కారు ఇచ్చిన నిధులతో సంబంధం లేకుండా సొంతంగా ప్రజల మేలు కోసం ఆయన ఖర్చు చేశారు. డబుల్ ఇండ్ల సముదాయంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతోపాటుగా భూగర్భ విద్యుత్ వైరింగ్ను చేపట్టారు. ఇండ్ల చుట్టూ రక్షణకు ఫెన్సింగ్, ఎల్ఈడీ వీధి దీపాలు, అంతర్గతంగా సీసీ రోడ్లు, యూపీవీసీ కిటికీలు, ఇంట్లో టైల్స్ అమరికతో ప్రైవేటు వెంచర్లలో కనిపించే అత్యాధునిక భవంతులను తలపించేలా డబుల్ ఇండ్లను నిర్మించారు. రంగులు అద్దుకున్న ఇండ్లన్నీ ఇప్పుడు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. త్వరలోనే అర్హులైన వారందరికీ డబుల్ ఇండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సుభాష్రెడ్డి చొరవను ప్రజలంతా అభినందిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాదారుడు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు రూపంలో 50 ఇండ్లను నిర్మించారు.
చూడముచ్చటగా ఉన్నాయి
కామారెడ్డి నియోజకవర్గంలోని జనగామ, జంగంపల్లిలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు చూడముచ్చటగా ఉన్నాయి. జాతీయ రహదారి 44కు పక్కనే జంగంపల్లిలో నిర్మించిన డబుల్ ఇండ్లను చూసిన వారంతా ప్రైవేటు విల్లా అనుకుంటున్నారు. నా కోరిక మేరకు పేదల కోసం అద్భుతంగా ఇండ్లు నిర్మించిన సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్ ప్రోత్సాహంతోనే..
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కాన్సెప్ట్ అద్భుతమైన ది. దేశంలో ఎక్క డా లేని విధంగా పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రోత్సాహంతో జనగామ, జంగంపల్లి గ్రామాల్లో 102 ఇండ్లను నిర్మించడం సంతోషంగా ఉంది. ఇదంతా పుట్టి పెరిగిన గడ్డకు రుణం తీర్చుకోవడంలో భాగమే. అదనంగా భారం పడినప్పటికీ పేదల మేలు కోసం ముందడుగు వేశాను.
-సుభాష్ రెడ్డి, కాంట్రాక్టర్