నిజామాబాద్, ఏప్రిల్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / మెండోరా : ఎంతో సంతోషంగా శుభ కార్యం నిర్వహించేందుకు వచ్చిన ఆ కుటుంబాల్లో అంతు లేని విషాదం నింపింది. గోదావరిలో మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. లోతును అంచనా వేయలేకపోయిన నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట, మాక్లూర్ మండలం డీకంపల్లి, గుత్ప గ్రామాలకు చెందిన వ్యక్తులు నదిలో అడుగు పెట్టగానే లోతుల్లో కూరుకుపోయి ప్రాణాలు వదిలారు. అప్పటి వరకు ఒడ్డుకు ఉన్నటువంటి కుటుంబీకులకు సైతం తమ వారు ఎటు వెళ్లారో? తెలియని అయోమయం. కాలకృత్యాలకు వెళ్లి ఉంటారేమోననే అనుమానం తప్ప నీళ్లలో కొట్టుకుపోయారని ఎవరూ ఊహించలేదు. నిమిషాల్లో జరిగిన ఉపద్రవమిది.
కండ్లు మూసి తెరిచేలోపే…
తమ ఇంట్లో వారసుడు పుట్టాడని సంబుర పడిన గుత్ప గ్రామానికి చెందిన సూర నరేశ్, రాధ దంపతులు… దగ్గరి బంధువుల సమక్షంలో గంగమ్మ చెంత పుట్టు వెంట్రుకలు తీద్దామని నిర్ణయించారు. రాధ తన అక్కలకు, సోదరుడు రాజుకు సమాచారం పంపింది. అంతా కలిసి సందడి వాతావరణంలో శుక్రవారం ఉదయమే గోదావరి చెంతకు చేరారు. పోచంపాడ్ పుష్కర ఘాట్ వద్ద వసతి ఉందని స్నాన మాచరించేందుకు రెడీ అవుతున్నారు. ఆడవాళ్లంతా గంగమ్మ పూజలకు ఏర్పాట్లు చేస్తుండగానే… బొబ్బిలి శ్రీకర్(14), రవికాంత్ ఘాట్ వద్ద మొదటగా నదిలోకి దిగారు. వీరి తర్వాత జిలకర యోగేశ్(16), బొబ్బిలి సిద్ధార్థ్(16) నీళ్లలోకి వచ్చారు. వీరంతా కేరింతలు కొడుతున్న క్రమంలోనే నదిలో నీటిప్రవాహ తాకిడికి ఘాట్కు దూరం గా జరిగిపోయారు. ఇది గమనించిన బొబ్బిలి శ్రీనివాస్ (40), జిలకర సురేశ్ (40), దొడ్లె రాజు(24) పిల్లలను కాపాడుకునేందుకు అడు గు ముందుకేశారు. వీరు కూడా నదిలోతుల్లోకి జారుకున్నారు. బావలను, వారి పిల్లలను గమనించిన రాజు చేయి అందివ్వబోయి లోతుల్లోకి కూరుకుపోయాడు. ఇలా కన్ను మూసి తెరిచే లోపు అప్పటి వరకు సందడి చేసిన వారంతా కనిపించకపోవడం క్షణాల్లో జరిగి పోయింది. ఇది గమనించిన స్థానిక మత్స్యకారుడు రాజు నది ప్రవాహానికి ఎదురు వచ్చి ధర్పల్లి రవికాంత్ అనే బాలుడిని ఒడ్డుకు చేర్చాడు.
మగదిక్కును కోల్పోయిన కుటుంబాలు..
మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన భూమన్న, చిన్న రాజు దంపతులకు ఐదుగురు సంతానం. వసంత, సంజు, మంజుల, రాధ నలుగురు కుమార్తెలు కాగా ఒక కుమారుడు రాజు. వీరితోనే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బంధువుల అమ్మాయి మానస. పెండ్లి జరిగాక వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా రాధ కొడుకు(9నెలలు) పుట్టు వెంట్రుకలకు హాజరయ్యేందుకు అంతా కలిసి గోదారమ్మ చెంతకు వెళ్లారు. దొడ్ల రాజుకు తప్ప సోదరిలకు అందరికీ వివాహాలు జరిగాయి. అంతా కలిసి పోచంపాడ్లో ఆనందంగా సేదతీరాలని భావించారు. విధి వక్రీకరించి ఏకంగా మూడు కుటుంబాలను రోడ్డున పడేశాయి. భూమన్న, చిన్న రాజు దంపతులకు ఏకైక కుమారుడు రాజుతో సహా వసంత భర్త సురేశ్, మనువడు యోగేశ్ మృత్యువాత పడ్డారు. బంధువుల అమ్మాయి మానస భర్త శ్రీనివాస్, ఇద్దరు కొడుకులు శ్రీకర్, సిద్ధార్థ్ నీళ్లలో కొట్టుకుపోయారు. నరేశ్, రాధ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెండోరా ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం పూర్తి చేశారు.
40 అడుగుల లోతుల్లో..
గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు పడిన కృషి అంతా ఇంతా కాదు. పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించడంతోనే మృతులు స్నానాలకు దిగిన ప్రాంతం నుంచి 30 నుంచి 50 అడుగుల దూరంలో నుంచే వెతుకులాటను ప్రారంభించారు. మొదట దొడ్లె రాజు మృతదేహం లభించడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనే నీటి ప్రవాహానికి అనుగుణంగా వెతుకుతూ మృతదేహాలను బయటికి తీశారు. ఎస్సారెస్పీ వరద గేట్ల ద్వారా లీకేజీ నీళ్లు చిన్నపాటి ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహం అంతగా ప్రభావం చూపించదు. అయితే కొంత కాలంగా సదర్మాట్కు నీళ్లు పంపించేందుకు ఎస్సారెస్పీ ఎస్కేప్ గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీళ్లన్నీ నిలకడగా కనిపించినప్పటికీ భారీగా లోతు ఉంటుంది. ఈత వచ్చిన వారు కూడా ఇంతటి లోతుల్లో ఈదడం కష్టతరమని అధికారులు చెబుతుంటారు.
రవికాంత్ ద్వారానే వారి ఆచూకీ..
మాణిక్బండార్కు చెందిన ధర్పల్లి రవికాంత్(15) అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. షాక్ నుంచి తేరుకుని నదిలో మిగిలిన వారంతా కొట్టుకు పోయారని చెప్పడంతో అంతా ఖంగుతిన్నారు. బాబాయ్… పెద్దనాన్న… అంటూ ఏడుస్తుండడం, పక్కనే ఉన్న వారంతా కంటికి కనిపించకపోవడంతో ఘాట్ వద్ద ఉన్న మహిళల్లో సందేహం కలిగింది. పిల్లలు, పెద్ద వారంతా ఎటు వెళ్లారో ఆరా తీసే లోపే రవికాంత్ అసలు సమాచారం చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. తమ వారికి ఏమైందో? అనుకుంటూ ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. మత్స్యకారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఘాట్ నుంచి 50 ఫీట్ల దూరం వరకు బండ రాళ్లలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా ఒక్కో మృతదేహం బయట పడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు దొడ్ల రాజు మృతదేహం వెలికి తీశారు. తర్వాత బొబ్బిలి శ్రీనివాస్ మృతదేహం లభించింది. గంట సేపట్లోనే మిగిలిన వారంతా విగత జీవులుగా మారడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. రవికాంత్ మత్స్యకారుడి దృష్టిలో పడి ఉండకపోతే… సురక్షితంగా ఒడ్డుకు చేరకపోతే నదిలో గల్లంతైన వారి విషయం త్వరగా తెలిసేది కాదు. ఆ బాలుడిచ్చిన సమాచారంతోనే తక్షణం గాలింపు ప్రక్రియ మొదలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని ఆర్మూర్ ఏసీపీ రఘు వెల్లడించారు. కండ్లు మూసి తెరిచే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుటుంబీకులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించడం అందరినీ కదిలించింది.
ఇవీ కూడా చదవండి..
విమానం మెట్లు ఎక్కుతూ జారిపడిన బైడెన్
విద్వేషాన్ని ఆపండి : జో బైడెన్
ట్రంప్ రిసార్టులో కరోనా కలకలం
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని