జార్జియా: విద్వేషానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ పిలుపునిచ్చారు. మన మౌనం సమస్యను మరింత జఠిలం చేస్తుందని ఆయన అన్నారు. మూడు రోజుల క్రితం అట్లాంటాలో ఆసియా అమెరికన్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 8 మంది మృతిచెందారు. దాంట్లో ఆరుగరు ఆసియా మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో జార్జియాలో పర్యటించిన బైడెన్.. ఆసియా అమెరికన్ నేతలను కలివారు. కోవిడ్ మహమ్మారి వేళ ఈస్ట్ ఏషియా దేశాల వారిపై విద్వేష దాడులు పెరిగాయని, వర్ణవివక్ష మన దేశాన్ని చాన్నాళ్లుగా పీడిస్తోందని, ఆ మంటల్ని ఆర్పేందుకు అమెరికన్లు ప్రయత్నించాలని బైడెన్ అన్నారు. కరోనా మహమ్మారికి ఆసియన్లే కారణమన్న ఉద్దేశంతో శ్వేతజాతీయులు.. ఆసియా అమెరికన్లపై దాడులు చేస్తున్నారు. గత ఏడాది నుంచి అమెరికాలో సుమారు మూడు వేలకు పైగా దాడులు జరిగాయి. విద్వేషం అమెరికాను సురక్షితంగా ఉంచదని, దాన్ని ఆపాలని బైడెన్ అన్నారు. అందరం కలిసి దాన్ని అడ్డుకోవాలన్నారు.