బోధన్, ఫిబ్రవరి 29: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి కుర్చీని లాక్కునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిద్ధంగా ఉన్నాడని, కోమటిరెడ్డి నుంచి గుంజుకునేందుకు ఉత్తమ్కుమార్రెడ్డి కాసుకు కూర్చున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిగిపోతూ రూ.7 వేల కోట్లు రైతుబంధు నిధులు ఉంచితే.. వాటిని బిల్లుల రూపంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి తీసుకున్నారని మండిపడ్డారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్స్ ఎదుట చెరుకు రైతులతో గురువారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో అర్వింద్ మాట్లాడారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై దేశవ్యాప్త చర్చ కోసం పసుపు రైతుల తరహాలో చెరుకు రైతులంతా వచ్చే లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను నిలబెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి ఉంటాడో లేదో తెలియదని అర్వింద్ అనుమానం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి నీవు చేసిన వాగ్దానాలు ఏమిటి.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని, ఎన్నికల వేళ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో నిజాం షుగర్స్పై శాసనసభ కమిటీ వేసి కాలయాపన చేశారని గుర్తు చేశారు. నిజాం షుగర్స్ను ప్రైవేటీకరణ చేస్తారా.. దీనిపై రూ.400 కోట్లు అయినా సరే పెట్టుబడి పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారని, ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అర్వింద్ అన్నారు.