మార్పు దిశగా రైతుల అడుగులు
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్నది. నూతన పంథాను ఎంచుకుంటున్న రైతులు వరితో పాటు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో ధర పలికిన పత్తి, సోయా, అపరాల వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ సీజన్లో ఆయా పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. వానకాలంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 10.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది.
నిజామాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం పంటల సీజన్ జోరందుకున్నది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. ఈసారి భిన్నమైన పంటలవైపు కొంతమంది కర్షకులు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, గతంలో మాదిరిగా ఉమ్మడి జిల్లాలో వరిసాగు అధికంగా ఉండనుంది. పంట మార్పిడి విధానాన్ని అవలంబించేందుకు రైతులు నూతన పంథాను ఎంచుకుంటున్నారు. వరితోపాటు సోయాబీన్, పత్తి, మక్కజొన్న, ఆపరాల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. వరిలో సగం మేర సన్నరకాలు పండించనున్నారు. సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో అత్యధిక మంది వరి వైపే మొగ్గుచూపుతున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు ప్రస్పుటం చేస్తున్నాయి. ఉభయ జిల్లాల్లో దాదాపు 10.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వనున్నాయి. రైతులకు సలహాలు, సూచనలు అవసరమైతే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పత్తి వైపు రైతు చూపు..
గడిచిన రెండున్నర ఏండ్లుగా తెలంగాణలో పండించిన పత్తికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ ప్రాంతంలో సాగుచేసిన కాటన్ను వ్యాపారులు ఎగబడి కొంటున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్రకటించిన అరకొర మద్దతు ధరను మించి గిట్టుబాటు దక్కుతుండడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, బోధన్, కోటగిరి మండలాల్లో పత్తి సాగుచేసిన రైతులకు కాసుల పంట పండింది. గరిష్ఠంగా క్వింటాలు పత్తికి రూ.10వేల నుంచి రూ.12వేల ధర పలికింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న రైతులు.. పత్తి సాగుపై మరింత ఆసక్తి చూపుతున్నారు. నల్లరేగడి నేలలు ఉన్న ప్రాంతాల్లో పత్తి వేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీగా పత్తి సాగవ్వనుంది. మరోవైపు బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లోనూ పత్తికి అనుకూలతలు ఉన్నాయి. పంట మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాలని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు పదేపదే సూచనలు చేస్తున్న నేపథ్యంలో పత్తి, సోయా, మక్కజొన్న పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి..
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, మంచి ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు దృష్టిపెడుతున్నారు. గతంలో సోయాబీన్ సాగుచేసిన రైతులు అదేపంటను మరోసారి వేసుకునేందుకు తిరిగి విత్తనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.12వేల పెట్టుబడితో కనీసం 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. రూ.50 వేల దాకా ఆదాయం వచ్చే వీలుంది. దీంతో రైతులు ఈసారి కూడా సోయా పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోయా పంటకు డిమాండ్ ఏర్పడినట్లుగా వ్యవసాయ రంగ నిపుణులు సైతం చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 80వేల 520 ఎకరాల్లో సోయా సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. మక్కజొన్న 44,851 ఎకరాలు, పసుపు 36వేల ఎకరాలు, వరి 4లక్షల 12వేల ఎకరాలు, ఆపరాలు 8వేల ఎకరాలు, పత్తి 15వేల ఎకరాల్లో సాగయ్యే వీలుందని వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. మొత్తం ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే సూచనలు ఉన్నాయి. పొట్టకోసం (ఇంటి అవసరాల నిమిత్తం) వరి సాగులో అత్యధిక శాతం సన్న రకాలను పండించనున్నారు.
ఆ మూడు పంటలు…
కామారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ప్రధాన పంటగా వరినే అత్యధిక మంది రైతులు ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వరి తర్వాత అధిక మొత్తంలో సోయాబీన్, పత్తి, మక్కజొన్న, ఆపరాల సాగు విస్తీర్ణం పెరుగనుంది. ఈ వానకాలంలో 5లక్షల 36వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ పేర్కొంది. ఇందులో అత్యధికంగా వరి 2,48,150 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, మక్కజొన్న 86,205 ఎకరాలు, పత్తి 73,545 ఎకరాలు, సోయాబీన్ 72,878 ఎకరాలు, కందులు 22,151 ఎకరాలు, పెసర్లు 10,900 ఎకరాలు, మినుములు 10,500 ఎకరాలు, చెరకు 4,100 ఎకరాలు, జొన్నలు 300 ఎకరాల్లో సాగుచేసే అవకాశముంది. సాగు అంచనాలకు తగినట్లుగా 60,313 క్వింటాళ్ల వరి విత్తనాలు, 18083 క్వింటాళ్ల సోయాబీన్, 70,256 క్వింటాళ్ల పత్తి, 4667 క్వింటాళ్ల మక్కజొన్న, 1054 క్వింటాళ్ల కంది, 1440 క్వింటాళ్ల పెసర, 880 క్వింటాళ్ల మినుములు అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు.
పంట మార్పిడితోనే అధిక లాభాలు..
రైతులు ఏటా పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. ఒకే రకమైన పంటలతో నేల సహజ స్వభావం దెబ్బతింటుంది. పోషకాలు నశిస్తాయి. తద్వారా దిగుబడులు తగ్గిపోతాయి. ఆదర్శవంతమైన సేద్యంతో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. పంటల మార్పిడితో దిగుబడి పెరిగి, మంచి లాభాలు వస్తాయి. సాగులో సలహాలు, సూచనల కోసం వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– ఆర్.తిరుమల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి