యాసంగిలోనూ నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నిశ్చింతగా పంటలు సాగు చేసుకోనున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. యాసంగిలో ఆయకట్టు కింద లక్షా 15 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 9 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన శివం కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉమ్మడి జిల్లా సాగు నీటి సలహాబోర్డు(డీఐబీ) సమావేశం నిర్వహించిన తర్వాత నీటి విడుదల తేదీలను ఖరారు చేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉండడంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి అలీసాగర్ 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజాంసాగర్, నవంబర్ 24 : నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు కోసం ప్రాజెక్టు నీటిని విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షా 15వేల ఎకరాలకు 9 టీఎంసీల నీరు అవసరం ఉందని ప్రతిపాదనలు తయారు చేశారు. ఇటీవల హైదరాబాద్లో రాష్ట్రస్థాయిలో జరిగిన శివం కమిటీ సమావేశంలో నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు కోసం 9 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా సాగు నీటి సలహాబోర్డు(డీఐబీ) సమావేశం నిర్వహించిన తర్వాత నీటి విడుదల తేదీలను ఖరారు చేయను న్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండడంతో ఆయకట్టు రైతులు సంతోషంగా పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు.
అలీసాగర్ వరకు
నిజాంసాగర్ మొదటి ఆయకట్టు నుంచి అలీసాగర్ వరకు లక్షా 15వేల ఎకరాల్లో యాసంగి పంటలను సాగు చేయనున్నారు. ఇందులో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంటలను సాగు చేయనుండగా మరో 15వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేయనున్నారు. జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి అలీసాగర్ వరకు 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంటల నూర్పిళ్లు పూర్తికావడంతో యాసంగి పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, బీర్కూర్, నస్రుల్లాబాద్, రుద్రూర్, కోటగిరి, ఎడపల్లి, బోధన్ మండలాల్లో తుకాలు సిద్ధం చేసుకొని డిసెంబర్ మొదటి వారంలో వరి నాట్లు వేసేందుకు సైతం దుక్కులు దున్నుకుంటున్నారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గంలోని రైతన్నలు ముందుగానే నాట్లు వేయనుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు సైతం డిసెంబర్ మొదటివారంలో నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటితో నిండి ఉంది.
సంతోషంగా ఉన్నాం
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉంది. అందుకే ప్రస్తుతం తుకాలు సిద్ధం చేసుకుంటు న్నాం. యాసంగి సాగు కోసం నీటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో సంతోషంగా ఉన్నాం. ప్రాజెక్టు కింద మా పంట పొలాలు ఉండడంతో దుక్కులు దున్నుకొని వరినారు సిద్ధం చేసుకుంటున్నాం. డిసెంబర్ మొదటి వారం నుంచి నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తారని అధికారుల ద్వారా సమాచారం. అందుకే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాం.
-గంగారెడ్డి, కొమలంచ, ఆయకట్టు రైతు, నిజాంసాగ ర్ మండలం
పూర్తిస్థాయిలో సాగు చేయనున్నాం
నిజాంసాగర్ ఆయకట్టు కింద వానకాలం మాదిరిగానే యాసంగిలో సైతం పూర్తిస్థాయిలో సాగు చేస్తాం. ఇప్పటికే దుక్కులు దున్నుకొని రెండు రోజుల కిందటే విత్తనాలు తుకాల కోసం చల్లాం. డిసెంబర్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నాం. నాకు ఆయకట్టు కింద ఉన్న ఆరు ఎకరాల్లో నాట్లు వేస్తా.
-మనీష్రెడ్డి , బుర్గుల్, ఆయకట్టు రైతు,నిజాంసాగర్ మండలం
లక్షా 15వేల ఎకరాలకు సాగర్ నీరు
ఇటీవల హైదరాబాద్లో శివం కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలకు 9 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదించారు. త్వరలో డీఐబీ సమావేశం ఏర్పాటు కానున్నది. నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాల్లో పంటలు వేసేందుకు రైతన్నలు సిద్ధం అయ్యారు. ఆయకట్టు కింద రైతులకు డిసెంబర్ మొదటి వారం నుంచి నీరు అవసరం ఉండగా అందుకు తగిన విధంగానే నీటి విడుదల చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాం.
-సొలోమాన్, ఈఈ నీటి పారుదల శాఖ