డిచ్పల్లి, డిసెంబర్ 18 ;తెలంగాణ ఏర్పాటుకు ముందు అభివృద్ధి ఆనవాళ్లు కనిపించేవి కాదు.. సంక్షేమ పథకాల ఊసే లేదు. రహదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. గ్రామా లు, మారుమూల ప్రాంతాల్లో ఉండే రహదారులను చూస్తే అవి రోడ్లు అని గుర్తించలేని దుస్థితి ఉండేది. ఏ ప్రాంతమైన అభివృద్ధిచెందాలంటే నీళ్లు, రహదారులు, విద్యుత్ సక్రమంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ .. రాష్ట్రంలోని రహదారుల నిర్మాణాలు, విస్తరణ కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నారు.
జక్రాన్పల్లి మండల వాసుల చిరకాల కోరిక అయిన డబుల్ రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 22.50 కోట్లు మంజూరు చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిధులు మంజూరు చేశారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి చేంగల్, వయా భీంగల్ గ్రామాల వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు రూ. 18.50 కోట్లు మంజూరయ్యాయి. కొన్నేండ్లుగా ఇరుకు రోడ్డుతో అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు డబుల్ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ సౌకర్యం మెరుగు కానుంది. జక్రాన్పల్లి మండలానికి డబుల్ రోడ్డుతో పాటు వర్షాలకు దెబ్బతిన్న మనోహరాబాద్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రూ. 4 కోట్లు మంజూరు చేశారు. దీంతో డబుల్ రోడ్డు, వంతెన నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే జక్రాన్పల్లి నుంచి భీంగల్ వరకు మెరుగైన రవాణా సౌకర్యం అందడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. ఒకేసారి జక్రాన్పల్లి మండలానికి రూ. 22.50 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిధులు మంజూరు చేయడం హర్షణీయం
జక్రాన్పల్లి మండల కేంద్రం నుంచి భీంగల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు రూ. 18.50 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా సింగిల్ రోడ్డుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది.
– సుకన్యా ప్రసాద్, చింతలూరు సర్పంచ్
ఆర్టీసీ చైర్మన్కు రుణపడి ఉంటాం
మేము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డిని ఒప్పించి 22 కోట్ల రూపాయలు జక్రాన్పల్లి మండలానికి మంజూరు చేయడం అభినందనీయం. ఆర్టీసీ చైర్మన్కు జక్రాన్పల్లి మండల ప్రాంత వాసులు ఎంతో రుణపడి ఉంటారు. అడగకుండానే రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు.
– కుంచాల విమలారాజు, జక్రాన్పల్లి ఎంపీపీ