నిజాంసాగర్, డిసెంబర్ 18:సమైక్య పాలనలో చెరువుల్లో నీరు లేక.. నీరు ఉన్నా సర్కారు ప్రోత్సాహం లేకపోవడంతో మత్స్యకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు ఉపాధి లేక వలసలు వెళ్లగా.. మరికొందరు ఇతర పనులు చేసుకునేవారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించింది. దీంతో చెరువులు కాలంతో సంబంధం లేకుండా నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సర్కారు సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏడేండ్లుగా సర్కారు చేపపిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నది.
కులవృత్తిపైన ఆధారపడిన మత్స్యకార్మికుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వందశాతం రాయితీపై చేపపిల్లలను సరఫరా చేస్తున్నది. ఇందులో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నెల రోజుల కిందటే 48లక్షల చేపపిల్లలను ప్రభుత్వం వందశాతం రాయితీపై విడుదల చేసింది. గడిచిన ఏడేండ్లుగా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 48 లక్షల చేపపిల్లలతోపాటు మరో 48లక్షల రొయ్యపిల్లలను సైతం విడుదల చేస్తున్నది. ఈ సంవత్సరం చేప పిల్లలతోపాటు రొయ్య పిల్లలను కూడా విడుదల చేసింది. వాటిలో బొచ్చ, రోహు, బంగారు తీగ, మృగాల రకాల చేపపిల్లలను విడుదల చేశారు.
ఏడేండ్లలో 3.36కోట్ల చేపపిల్లలు..
సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మత్స్యకార్మికులకు వందశాతం రాయితీపై ఏడేండ్లుగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. మత్స్య అభివృద్ధి పథకం కింద చేపపిల్లలను విడుదల చేయడంతో మత్స్యకార్మికులకు ఉపాధి లభించింది. దీంతో వలసలకు వెళ్లిన మత్స్యకార్మిక కుటుంబాలు సైతం తిరిగి వచ్చాయి. మత్స్యకార్మికులకు రాయితీపై తెప్పలు, వలలు, వాహనాలను ప్రభుత్వం అందజేస్తున్నది. ఏడేండ్లలో సుమారు 3.36 కోట్ల చేపపిల్లలను విడుదల చేశారు.
చాలా మార్పు..
సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత మత్స్యకార్మికుల జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ఉచితంగా చేపపిల్లలను విడుదల చేయడంతో ప్రస్తుతం దళారులు లేకుండా అయ్యారు. గతంలో దళారులు చేపపిల్లలను అందిస్తే వాటిని చెరువులు, కుంటల్లో విడుదల చేసేవారు. అవి పెద్దగా అయ్యాక వాళ్లు నిర్ణయించిన మద్దతు ధరకు దళారులే కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. అలాంటివి ఏడేండ్లుగా కనుమరుగయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన చేపపిల్లలు పెద్దవైన తర్వాత మత్స్యకార్మికులు వేటాడి మద్దతు ధర ఎక్కడ బాగుందో అక్కడికి తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు. మత్స్యకారికులకు రెండు చక్రాల టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు, తెప్పలు, వలలు అందించడంతో వారు చేపలను వేటాడుతూ మద్దతు ధరకు విక్రయించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుపై 2000 మత్స్యకార్మిక కుటుంబాలు ఆధారపడ్డాయి. వారిలో నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతోపాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన కార్మికులు ఉన్నారు. ప్రతి సంవత్సరం 48లక్షల చేపపిల్లలను విడుదల చేస్తుండగా అవి పది నెలల్లో వేటకు పనికివస్తాయి. ఈ లెక్కన ప్రతి సంవత్సరం 500 మెట్రిక్ టన్నుల చేపలను (రూ.50 కోట్ల) వేటాడుతున్నారు.