ఖలీల్వాడి, డిసెంబర్ 14 : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణంలోని మమతా మెడికల్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సైబర్ సైకియాట్రిక్ అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అంశంపై డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడారు. ప్రస్తుతం చాలా మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు సామాజిక మాధ్యమాన్ని వినియోగిస్తూ బానిస అవుతున్నారని, సమాజంలో యువత చెడిపోవడానికి ముఖ్య కారణం మత్తు పదార్థాల కన్నా సామాజిక మాధ్యమేనన్నారు.
సామాజిక మాధ్యమాల్లో యువత చెడ్డ దారులను ఎంచుకుంటున్నారన్నారు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమానికి నాగాపూర్కు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుషిప్ గవండే హాజరై మాట్లాడారు. అవగాహన సదస్సుకు జిల్లాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ జార్జిరెడ్డి చైర్మన్లుగా వ్యవహరించారు. ఈ అంశంపై కులంకుశంగా చర్చించి నూతన చికిత్స మార్గాలు, నివారణ చర్యలుపై డాక్టర్లకు అవగాహన కల్పించారు. డాక్టర్ విశాల్ ఆకులకు ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సతీశ్బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నారాయణరావు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నిజామాబాద్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని డాక్టర్ విశాల్ ఆకుల అన్నారు.