గాంధారి, డిసెంబర్ 13: జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో గాంధారి కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ శిల్ప, వ్యాయామ ఉపాధ్యాయురాలు సవిత తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన అండర్ -16 జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాఠశాలకు చెందిన సోనిక అనే విద్యార్థిని గ్రూప్-బీ పోటీల్లో (600 మీటర్లు, 1600 మీటర్లు, షాట్ఫుట్, జావలిన్త్రో) బంగారు పతకాలను సాధించినట్లు తెలిపారు.
సౌందర్య 600 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, లత 1600 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, షాట్ఫుట్లో అంజలి కాంస్య పతకం, డిస్కస్త్రోలో లక్ష్మి కాంస్య పతకం, జావలిన్త్రోలో మౌనిక కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. అండర్ -14 షాట్ఫుట్ పోటీల్లో కీర్తి రజత పతకం సాధించినట్లు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సోనిక జనవరి 9, 10, 11వ తేదీల్లో బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొననున్నట్లు వివరించారు. జిల్లా స్థాయి పోటీల్లో రాణించి పతకాలను సాధించిన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థినులు అభినందించారు.