ఖలీల్వాడి, డిసెంబర్ 13 : సంగీత్ కల్చరల్ అకాడమీ 20వ వార్షికోత్సవ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్ అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం కళాకారులను సన్మానించారు. తెలంగాణ భాషా సాం స్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్య కళాకారులను ‘భీమన్’ అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రత్యేక అతిథిగా పద్మశ్రీ కిన్నెర మొగులయ్య, నగర మేయర్ దం డు నీతూకిరణ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పలు జిల్లాలకు చెందిన నృత్య కళాకారులకు ‘భీమన్’ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. వివిధ రకాల నృత్యాలు అంతరించిపోయే నేటి రోజుల్లో వాటికి జీవం పోసి ఆదుకుంటున్న కళాకారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వారి మనుగడకు కావల్సిన సహాయసహకారాలు ఎల్లవేళలా అందజేస్తామన్నారు. పద్మశ్రీ కిన్నెర మొగులయ్యను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సంగీత్ కల్చరల్ గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంఘం అమృత్కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.