నందిపేట్, డిసెంబర్ 8: అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పలు ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అర్గుల్ శివారులో నిర్మిస్తున్న జిల్లా గురడిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఆయన..పలు సూచనలు, సలహాలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో (పెర్కిట్) ఎస్ఎస్కే సమాజ్ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆర్మూర్ పట్టణంలో నిర్మిస్తున్న పద్మశాలీ ఫంక్షన్హాలు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.
భవనాల నిర్మాణాల నిర్మాణానికి నిధులు మంజూరు
నందిపేట్కు చెందిన నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు, సిద్ధాపూర్ గ్రామ మాదిగ, మాల సామాజిక వర్గాల ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, షాపూర్ గ్రామ మున్నూరుకాపు సభ్యులు జీవన్రెడ్డిని కలిశారు. తమ సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఒక్కొక్క సంఘానికి రూ.5లక్షల చొప్పున వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అని పేర్కొన్నారు. ప్రతి పల్లెలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయని, ప్రతి ఇంట్లో సంక్షేమ ఫలాలు విరాజిల్లుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల కంట్లో సంతోషం కనిపిస్తుందన్నారు. అడ్డదారిలోనైనా అధికారంలోకి వచ్చి ఉచిత పథకాలను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న బీజేపీని తరిమికొట్టడానికి రాష్ట్ర ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని జీవన్రెడ్డి పిలుపునిచ్చారు.