శక్కర్నగర్, డిసెంబర్ 8: మానవ హక్కులను పరిపూర్ణంగా అర్థం చేసుకుని, హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి సార్వజనీన మానవహక్కుల ప్రకటన చేసిందన్నారు. మానవ హక్కుల ప్రకటన అధికరణలు వ్యక్తి స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. హక్కుల రక్షణకు, ఉల్లంఘనకు వ్యతిరేకంగా అందరూ చైతన్యవంతులై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం గంగులు, పిట్ల సరిత, సహాయ కార్యదర్శులు మహ్మద్ అక్తర్, అరుణ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రంగారత్నం, న్యాయవాదులు సీహెచ్వీ హన్మంత్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.