ఖలీల్వాడి, నవంబర్ 29 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగర అభివృద్ధికి రూ. 900 కోట్లతోపాటు ఇటీవల అదనంగా మరో వంద కోట్లు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాత కలెక్టర్ కార్యాలయంలో కళాభారతి నిర్మాణం, ప్రజల సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చాలెంజ్గా తీసుకుని పూర్తి చేస్తున్నామన్నారు. ఐటీ హబ్, అహ్మదీ బజార్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ ట్యాంక్బండ్ నిర్మాణంలో ఉన్నాయని, వాటిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, తాగునీటి వసతి కల్పించామన్నారు. దుబ్బ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో అన్ని సదుపాయాలతో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని, ద్వారకానగర్, అర్సాపల్లి, వర్ని రోడ్డు, ఖిల్లా శ్మశానవాటిక నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 36 ట్రాన్స్ఫార్మర్లు, 169 స్తంభాలను పక్కకు జరిపించి ప్రధాన రోడ్లను విస్తరించామని వివరించారు.
నగరంలోని నలుదిక్కులా వెజ్, నాన్వెజ్ మార్కెట్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖలీల్వాడిలోని ఆర్డీవో కార్యాలయం, సౌత్ తహసీల్దార్, డీఈవో కార్యాలయాల వద్ద ఇంటిగ్రేటేడ్ మార్కెట్లు నిర్మిస్తున్నామన్నారు. ఆర్మూర్ రోడ్డు, వినాయక్నగర్ ప్రాంతాల్లో మరో రెండు మార్కెట్లు, రజకుల కోసం పరిశుభ్ర వాతావరణంలో దోభీఘాట్ల నిర్మాణానికి స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు బాసటగా సెలూన్లను ఆధునీకరించుకునేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. తిలక్గార్డెన్ను ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రత్యేక ఆర్కిటెక్చర్ బృందం హైదరాబాద్ నుంచి నగరానికి వస్తున్నదని తెలిపారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి కూడా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ (బీలర్ఎస్) కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.