బోధన్/ ఖలీల్వాడి, నవంబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. 2009లో నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అన్న దృఢ సంకల్పంతో ఆమరణ నిరాహారదీక్షకు నాటి తెలంగాణ ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ పూనుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మంగళవారం జిల్లాలో ‘దీక్షా దివాస్’ను ఘనంగా నిర్వహించారు. జడ్పీలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, శేఖర్రెడ్డి, అంజ య్య, నీలంరెడ్డి, శేఖర్రాజ్, నాగారావు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
దీక్షా దివస్ సందర్భంగా టీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవంబర్ 29 స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమరశంఖం పూరించిన రోజని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమోహన్, సోమసుందర్, రాధ, సరిత, వనజ, స్వప్న, బాలమణి, గంగమణి, లక్ష్మి పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో..
బోధన్లో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ‘దీక్షా దివాస్’ను పాటించారు. నాటి కేసీఆర్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ నిరాహారదీక్షలో కూర్చున్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి తెగించిన సందర్భాన్ని తెలంగాణ గడ్డ ఎన్నటికీ మర్చిపోలేదన్నారు. ‘దీక్షా దివాస్’ దీక్షలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ, గిరిధర్, సాగర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.