ఎల్లారెడ్డి, నవంబర్ 29 : ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నది ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రత్యేక రాష్ట్ర పోరును అణగదొక్కేందుకు అడ్డంకులు సృష్టించింది, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నింది వైఎస్సేనన్నది అందరికీ తెలుసు. దశాబ్దాల కల సాకారం కాకుండా అడ్డు పడింది, తెలంగాణ బిడ్డల ఆత్మాభిమానాలను దెబ్బకొట్టింది వైఎస్సే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తెలంగాణ నినాదాన్ని, పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని అడుగడుగునా అవమానించిన చరిత్ర వైఎస్ది. అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడేమో తెలంగాణను ఉద్ధరించడానికి బయల్దేరడం విస్మయానికి గురి చేస్తున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కడా కనిపించని షర్మిలమ్మ.. ఒకసారి చరిత్ర తెలుసుకోవమ్మా అని తెలంగాణ సమాజం హితవు పలుకుతున్నది.
అడ్డుకున్నది మీ కుటుంబమే కదా..?
ఉద్యమ సారథి కేసీఆర్ పోరాట స్ఫూర్తితో యావత్ తెలంగాణ కదిలొచ్చింది. ఆయన సంకల్ప దీక్షతో రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే, తెలంగాణ ఏర్పాటుపై తొలుత ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వెనుకడుగు వేసింది. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైంది. కాంగ్రెస్ నాన్చుడు ధోరణి వల్లే అమాయకులైన యువకులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి దశాబ్దాల కల సాకారం కాకుండా అడ్డుకున్నది వైఎస్సే. తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేసినప్పుడు వైఎస్ అడ్డు పడిన విషయం అందరికీ తెలిసిందే కదా. మీ కుటుంబం వల్లే కదా తెలంగాణ ఆత్మాభిమానాలు దెబ్బతిన్నవి. వందలాది ఆత్మబలిదానాలు జరిగాయి. అప్పుడు ఎక్కడా కనిపించని షర్మిల.. ఇప్పుడేమో ‘రాజన్న రాజ్యం’ అంటూ గ్రామాల్లో తిరుగుతుండడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఉద్యమాన్ని నీరు గార్చిన కుటుంబానికి తెలంగాణలో ఓటు కోసం యాత్ర చేస్తే ఆదరించే వారు ఎవరున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తున్న వారిని జైలులో పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి కూతురిగా మీ(షర్మిల)పై ప్రజలకు ద్వేషం తప్ప ప్రేమ ఉండదనే నిజాన్ని మరిచి, పాదయాత్ర పేరిట పబ్బం గడపడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
అప్పుడెక్కడ?
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక చేపట్టిన పాదయాత్రలో కిరాయి మనుషులు తప్ప స్థానికులు లేకపోవడమే మీ యాత్ర నిజ స్వరూపాన్ని తెలియజేస్తున్నదనే విషయాన్ని తెలంగాణ వాదులు ఎత్తి చూపుతున్నారు. నాయకులు, కార్యకర్తలు లేని పార్టీని నడుపుతూ పాదయాత్రకు బయల్దేరిన షర్మిలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో కనిపించని కడప బిడ్డకు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ ఎలా వచ్చిందని ఉద్యమ బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్ర ప్రజలు పోరాటం చేసినప్పుడు నీ కుటుంబం.. ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను అడ్డుకున్న రోజులను మరువక ముందే మీరు పాదయాత్ర పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకోవడం వృథా ప్రయాసేనని ప్రజలు సూచిస్తున్నారు. పట్టుమని పది మంది కూడా లేకుండా ఊరూరా తిరుగుతున్న షర్మిలను చూసి జ నం నవ్వుకుంటున్నారు. షర్మిల పాదయాత్రలో కనిపిస్తున్నది ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకపోవడాన్ని ఉద్యమ బిడ్డలు ఎత్తి చూపుతున్నారు. మీ పాదయాత్ర వెంట ఉన్న డీసీఎంలలో వచ్చే మహిళలు, వారి వెంట ఉండే ఆంధ్రా నుంచి వచ్చిన కార్యకర్తలను చూసి తెలంగాణ ప్రజలు ఇదేదో డ్రామా పార్టీ అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.