నిజామాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిజామాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దాలని.. మరో రెండు నెలల్లో పరిశీలించేందుకు వస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల అభివృద్ధిపై ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ నగరాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇటీవల నిజామాబాద్ నగరాభివృద్ధికి మంజూరైన రూ.100 కోట్ల నిధులతో పాటు మౌలిక వసతుల కల్పనకు అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసే బాధ్యత తమదంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం, హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత సీఎంకు విన్నవించారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు.
ఇందూరు నగరాన్ని సకల వసతులతో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల అభివృద్ధిపై హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, కలెక్టర్నారాయణరెడ్డితో గంటన్నర పాటు సమీక్షించారు. సమీక్షలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న నిజామాబాద్ నగరాభివృద్ధికి మంజూరైన రూ.100 కోట్ల నిధులకు అదనంగా మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత తనదంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నగరాభివృద్ధిని త్వరితగతిన చేపట్టడంతోపాటు ఇదే విధమైన ప్రణాళికలను ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ అమలుచేయాలని ఆదేశాలిచ్చారు.
కళాభారతి, అవుట్ డోర్ స్టేడియాలు
నిజామాబాద్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదికపై సీఎం పలు వరాలు కురిపించారు. నగరానికి రూ.100 కోట్లతో పాటు పాత కలెక్టరేట్ స్థలంలో వేయి మంది కూర్చునేలా ఇండోర్ ఆడిటోరియాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని సీఎం హామీ ఇవ్వగా ఈ అంశంపై ఆదివారం జరిగిన సమీక్షలోనూ చర్చించారు. ఇందూరు కళాభారతి పేరిట నిర్మించే ఆడిటోరియాన్ని అత్యాధునిక వసతులతో సాంస్కృతిక, కళా ప్రదర్శనలకు నెలవుగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కొత్త కలెక్టరేట్కు మార్చినందున స్థలాల సమస్య ఉండబోదన్నారు. ప్రభుత్వ స్థలాల్లో మరోఅవుట్ డోర్ స్టేడియాన్ని సైతం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ రెండు నిర్మాణాలు నగరం మధ్యలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణను పూర్తి చేయాలన్నారు.ఇండోర్ ఆడిటోరియం, అవుట్డోర్ స్టేడియాలతో నగరవాసులకు ఆహ్లాదాన్ని చేరువ చేసేలా ఉండాలన్నారు. తిలక్గార్డెన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. తన బాల్యంలో అక్కడ తిరిగినట్లు కేసీఆర్ గుర్తుచేసుకొన్నారు.
ఆధునిక దోబీఘాట్లు, సెలూన్స్
నగరంలో ఆధునిక దోబీఘాట్లు, సెలూన్ల నిర్మాణాలపైనా చర్చ జరిగింది. నిజామాబాద్లో మోడ్రన్ దోబీఘాట్, సెలూన్ల నిర్మాణాలను చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షలో నిర్ణయించిన అంశాలన్నింటికీ నిధుల కొరత ఉండబోదని సీఎం హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు నగర జనాభాకు తగ్గట్లుగా శ్మశాన వాటికలను ఆధునీకరించాలన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాల్లో మోడ్రన్ క్రిమిటోరియాలు ప్రారంభంలోకి వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేయగా.. మున్సిపల్ అధికారులు తక్షణం ఈ ఏర్పాట్లలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు.
హజ్ భవన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత వినతి
నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హజ్ భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రాతోపాటు ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు నెలల్లో జిల్లాకు వస్తా..
ప్రస్తుతం చేపట్టిన సుందరీకరణ పనులతో పాటు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో తాను అభివృద్ధి పనులను పరిశీలించడానికి వస్తానని అన్నారు. అవసరమైన చోట్ల రోడ్డు వెడల్పు, డివైడర్లు, గ్రీనరీ వంటి ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను నిర్మించాలని సూచించారు. వీధి దీపాల అలంకరణతోపాటు ఆకట్టుకునేలా జంక్షన్లను తీర్చిదిద్దాలని చెప్పినట్లు తెలిసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలు, మౌలిక వసతులు ఉండాలన్నారు. నిజామాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలను ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ అమలు చేయాలని సీఎం సూచించారు. ఈ బాధ్యతలను జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. నిజామాబాద్ నగర పర్యటన సందర్భంగా రోడ్డు మార్గంలో సీఎం గమనించిన అనేక విషయాలను ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో కేసీఆర్ ప్రస్తావించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు ప్రాంతం ఇరుకుగా మారినందున ప్రజల అవసరాలకు తగ్గట్లుగా స్థలాలను అన్వేషించి ప్రతిపాదనలు పంపాలని కేసీఆర్ ఆదేశించారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, అవసరమైతే అక్కడికి వెళ్లి సందర్శించి రావాలని సూచించారు.