రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చే దారి లేక భార్య, పిల్లలతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకరమైన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకున్నది. ఆదిలాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ (37) రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు నిర్వహించేవాడు. అప్పులు కావడంతో హైదరాబాద్కు మకాం మార్చి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అక్కడా కలిసి రాకపోవడంతో పాటు భాగస్వాములతో ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. మనస్తాపం చెందిన సూర్యప్రకాశ్ నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్ గదిలో భార్య అక్షయ (36), పిల్లలు ప్రత్యూష (11), అద్వైత్ (7)తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ క్రైం, ఆగస్టు 21 : రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని దాంతో తమ కు ఉన్న అప్పులు అన్ని తీరిపోతాయన్న నమ్మకంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఓ వ్యాపారి మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. పాత అప్పులే తీరకపోగా కొత్తగా ఇంకా కోట్ల రూపాయలు అప్పులు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారం కోసం సన్నిహితులు, బంధువులు ఇచ్చిన అప్పులు చెల్లించకపోవడంతో పాటు భాగస్వాముల వేధింపులు పెరిగిపోయాయి. దీంతో పాటు సొసైటీలో పరువు పోయిందని తీవ్ర మనస్థాపం చెందిన ఆ వ్యాపారి తమ మృతికి వేధింపులే కారణమంటూ ‘సూసైడ్ నోట్’ రా సి కుటుంబంతో సహా ఓ హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్, మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి… ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్(37) స్థానికంగా వివిధ వ్యాపారాలు చేస్తుండేవాడు. అప్పులు కావడంతో భార్య కొత్తకొండ అక్షయ (36), కూతురు ప్రత్యూష (11), కుమారుడు అద్వైత్ (7)తో కలసి ఏడు సంవత్సరాల క్రితం హైదరాబాద్లోని మైహోమ్స్కు మకాం మార్చాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ ఇతరులతో భూమి కొనుగోలు చేసి వెంచర్ చేశాడు. ఇందుకోసం వెంచర్ చేసేందుకు మిత్రులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అయితే వెంచర్లో ప్ల్లాట్లు అమ్ముడు పోకపోవడం, దానికి తోడు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో పాటు భాగస్వాముల మధ్య లాభనష్టాల విషయంలో మనస్పర్థలు వచ్చాయి.
భాగ స్వాములు సూర్యప్రకాశ్ వద్ద ప్రామిసరి నోట్లు, చెక్కు లు తీసుకుని ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వేధింపులకు పాల్పడ్డారు. అంతే కాకుండా అప్పులు ఇచ్చిన వారిలో కొందరికి సూర్యప్రకాశ్ చెక్కులు రాసి ఇచ్చాడు. దాంతో వారు కోర్టులో కేసు పెట్టినట్లు సమాచారం. దీంతో సొసైటీలో సైతం తన పేరు చెడిపోయిందని తీవ్రమస్థాపం చెందిన సూర్యప్రకాశ్ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో గల హోటల్ కపిలలో ఈ నెల 4వ తేదీన ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.అప్పటి నుంచి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సూర్య ప్రకాశ్ ఆదివారం గది తలుపులు తీయకపోవడంతో అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది గది తలుపులు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. నగర సీఐ కృష్ణ, ఎస్సై సందీప్ హోటల్కు చేరుకొని వారు అద్దెకు తీసుకున్న 101 గది తలుపులు తెరిపించారు. గదిలో నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. సూర్యప్రకాశ్ ఫ్యాన్కు ఉరేసుకోగా, అతని భార్య అక్షయ, కూతురు ప్రత్యూష, కుమారుడు అద్వైత్ క్రిమిసంహారక మందు తాగి పడి ఉన్నారు. నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
సూసైడ్ నోట్ లభ్యం
ఆత్మహత్యకు పాల్పడిన సూర్యప్రకాశ్ గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో తమకు అప్పులు ఇచ్చిన వారిలో నలుగురు వేధించారని, తమ చావుకు వారే బాధ్యులని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఏసీపీని వివరణ కోరగా సూసైడ్ నోట్ లభించింది వాస్తవమేనని అందులో ముగ్గురి పేర్లు ఉన్నాయని దాని ఆధారంగా వారిపై ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులై వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ పేర్కొన్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు వెల్లడించారు.
హోటల్లో గది బుక్ చేసిన ఆ వ్యక్తి ఎవరు?
హోటల్లో వేరే వ్యక్తి గదిని బుక్ చేసినట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తికి ఆత్మహత్యకు పాల్పడిన సూర్యప్రకాశ్కు సంబంధం ఏమిటనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. హోటల్లో గది బుక్ చేసిన వ్యక్తి ఈ నెల 4 తేదీన సా యంత్రం 6.30 గంటలకు రూ.2,500 నగదు చెల్లించి సూర్యప్రకాశ్ అనే వ్యక్తి పేరు మీద గదిని బుక్ చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. అయితే సూర్యప్రకాశ్ రాత్రి 9.30 గంటల వరకు వస్తాడని చెప్పి వెళ్లినట్లు తెలిసింది. సూర్యప్రకాశ్ కుటుంబం ఆ రోజు రాత్రి 11.30 గంటలకు హో టల్కు వచ్చినట్లు సమాచారం. అయితే వీరి కోసం హోటల్లో గదిని బుక్ చేసిన వ్యక్తికి.. సూర్యప్రకాశ్ కుటుంబంతో ఉన్న సంబంధంపై విచారణ కొనసాగిస్తున్నారు.