నిజాంసాగర్, ఆగస్టు16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని, సమాజంలో తలెత్తుకొని జీవించాలనే ఉద్దేశంతో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కోసం నిజాంసాగర్ మండలాన్ని పైలట్ మండలంగా ప్రకటించారు. దీంతో మండలంలో మొత్తం 1297 దళిత కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వారిలో 1090 మందికి రెండు నెలల కిందట యూనిట్లను అందజేశారు. 1090 మందిలో ట్రాక్టర్లు, జేసీబీలు, వరి కోత యంత్రాలు, కార్లు, ఆటోలు, జీపులు వంటి యూనిట్లను అందజేశారు. మిగిలిన వారికి గొర్రె లు, బర్రెలు, సూపర్మార్కెట్లు, దుకాణాలు ఉండగా వారికి త్వరలో అందజేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంసాగర్ మండలాన్ని పైలట్ మండలంగా ప్రకటించి వంద శాతం దళితులకు యూనిట్లను అందజేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే 1090 మంది యూనిట్లను అందుకొని వాటి ద్వారా ఆర్థికంగా రాణిస్తున్నారు. చాలామంది దళితులు అందుకున్న యూనిట్లతో మండలంలోనే కాదు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆదాయాన్ని పొందుతున్నారు. కేసీఆర్ దయతో తాము సమాజంలో తలెత్తుకొని జీవిస్తూ ఆర్థికంగా రాణిస్తున్నామంటున్నాయి దళిత కుటుంబాలు.
మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన మంగ ప్రకాశ్కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెండ్లి చేసినా తన పిల్లలతో కలిసి తండ్రి ఉంటున్న గోర్గల్ గ్రామంలోనే ఉంటున్నది. దళితబంధు పథకంలో ప్రకాశ్తో పాటు కుమారుడు పాల్దినాకర్, కుమార్తె నాగమణి వీరి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.పది లక్షల చొప్పున మంజూరయ్యాయి. దీంతో ఒకే యూనిట్ను ఎంపిక చేసుకున్నారు. వరి కోత యంత్రంతో పాటు తరలించేందుకు ఓ ట్రాలీ కొనుగోలు చేశారు. మొ త్తం రూ. 30 లక్షల వ్యయంతో ఒకే యూనిట్ను ఎంపిక చేసుకొన్నారు. వీరికి నెలరోజుల కిందట వరికోత యంత్రం అందించారు. నెల రోజుల్లో సుమారు 120 గంటలు పంట నూర్పిళ్లు చేశారు. గంటకు రూ.2800 చొప్పున సంపాదించగా డీజిల్, డ్రైవర్ ఖర్చులు పోను గంటకు వెయ్యి రూపాయల చొప్పున నెల రోజుల్లో రూ.లక్షా 20వేలు సంపాదించారు. కూలీ పనులు చేసుకునే వీరు నెల రోజుల్లో ఒక్కొక్కరు రూ.40 వేల చొప్పున సంపాదించామంటే కేసీఆర్ పుణ్యమే అంటూ ఆయనను దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకలో ఆరుతడి పంటల నూర్పిళ్లు ప్రారంభం కానున్నాయని అక్కడికి వెళ్తా మని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన దళితబంధుతో మా లాంటి దళితులు కూలీల నుంచి ఓనర్లుగా మారామని చెబుతున్నారు.
మండలంలోని మంగ్లూర్ గ్రామానికి చెందిన గైని రమేశ్కు అన్నదమ్ములు ఉన్నారు. అందరూ కలిసి ఒకే యూనిట్ను ఎంపిక చేసుకొని వరి కోత యంత్రాన్ని తీసుకున్నారు. రెండు నెలల పాటు వరి కోత యంత్రాన్ని నడిపి రెండు లక్షల వరకు సంపాదించుకున్నారు. వచ్చిన డబ్బులతో వరి కోత యంత్రం రవాణా చేసేందుకు మరో వాహనాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో నూర్పిళ్లు చేసేందుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో సంఘంలో తలెత్తుకొని బతికేలా జీవిస్తున్నాం. తమపై నమ్మకంతో అప్పగించిన యూనిట్తో లక్షాధికారిగా మారుతాం. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతామని తెలుపుతున్నారు.
దళితబంధు పథకంలో భాగంగా మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములు టాటా కంపెనీ గూడ్సు వాహనం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు వాహనాన్ని అందజేశారు. మొన్నటి వరకు గ్రామంలో డ్రైవర్గా పని చేసే రాములు గ్రామంలో ఉండకుండా తన వాహనంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వాటర్ ప్లాంట్లో ఐదు రూపాయలకు ఒక డబ్బా నీటిని తీసుకొని రూ.20 చొప్పున విక్రయిస్తున్నాడు. రాములు ప్రతిరోజు సుమారు 200 నుంచి 250 వరకు డబ్బాలను విక్రయిస్తుండగా డబ్బాకు పదిహేను రూపాయల చొప్పున ప్రతీ రోజు డీజిల్ ఖర్చులు పోను రెండు వేల నుంచి రూ.2500 వరకు సంపాదిస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని దళితబంధు పథకం అందించడంతో తాను రోజుకు రెండు వేల నుంచి రూ.2500 వరకు సంపాదిస్తున్నాడు. గ్రామంలో రాములు అన్న కోళ్లఫారం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం షెడ్డు పనులు సాగుతున్నాయి. ఇంటి వద్ద పొలం చూసుకుంటూ అన్న ఉండగా తాను హైదరాబాద్లో ఉపాధి పొందుతు న్నానని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.