వర్ని, ఆగస్టు 11: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించే వరకూ విశ్రమించేదిలేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన 40 బెడ్ రూం ఇండ్లను గురువారం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారురాలు దొమ్మా టి వీణ ఇంటిని రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో స్పీకర్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటికే 10వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయించామని, మరో 10వేల ఇండ్లు మంజూరు చేయించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్లు విముఖత చూపిస్తున్నా వారిని బతిమిలాడి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. పాత వర్నిలో ఇప్పటికే 80 ఇండ్లు మంజూరు చేశామని, సర్పంచ్ పద్మా నాగభూషణం కోరిక మేరకు మరో 20 ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మహిళా మండలి భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, కో -ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, సర్పంచులు ఎంబడి పద్మ, రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ను ప్రారంభించిన సభాపతి
బాన్సువాడ టౌన్, ఆగస్టు 11: దళితబంధు పథకం కింద లబ్ధిదారుడు మళ్ళురి సాయిలు బాన్సువాడ బస్డిపో వద్ద ఏర్పాటు చేసుకున్న శ్రీ వినాయక టెంట్ హౌస్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. దళితులను వ్యాపారవేత్తలుగా చూడాలన్న కోరిక నుంచి వచ్చిన ఆలోచననే దళితబంధు పథకం అని స్పీకర్ అన్నారు.