ఇందూరు, ఆగస్టు 11 : ఇందూరు త్రివర్ణ శోభితమైంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ రన్ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఫ్రీడమ్ రన్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గుండెల నిండా దేశభక్తిని నింపుకుని ప్రతి ఒక్కరూ శ్వేతవర్ణపు టీ షర్టులను ధరించి ర్యాలీలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు.
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి , జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు ఫ్రీడమ్ రన్లో భాగస్వాములయ్యారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, ఏడో బెటాలియన్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వైద్యులు, నర్సింగ్ స్టూడెంట్స్, క్రీడా సంఘా ల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు త్రివర్ణ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకేతంగా మూడు రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జడ్జి కె.సునీత మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. దేశాభ్యున్నతి కోసం ప్రతిఒక్కరూ కంకణబద్ధులై పని చేయాలని ఉద్బోధించారు. జడ్పీ చైర్మన్ విఠల్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతి భారతీయుడికి పండుగ లాంటివని పేర్కొన్నారు. రక్తసంబంధం అని చూడకుండా ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే తత్వం ఒక్క భారతీయులకే సొంతమన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 22వరకు కొనసాగే వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములవుతూ విజయవంతం చేయాలని కోరారు. ప్రతిఒక్కరూ ముందుకు సాగుతూ దేశప్రగతికి పాటుపడాలన్నారు.