దశాబ్దాల కల నెరవేరనున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానున్నది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాలేజీ స్థాపనతో పాటు ప్రభుత్వ దవాఖాన అప్గ్రేడ్ కోసం రూ.235 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు తొలి నుంచి ప్రత్యేక ప్రేమ, అభిమానం ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేశారు. వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాలకు రూ.వందల కోట్ల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్తో పాటు కాలేజీ ఏర్పాటుకు సహకరించిన మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.
– కామారెడ్డి, ఆగస్టు 6
కామారెడ్డి, ఆగస్టు6: కామారెడ్డి జిల్లా ప్రజల కల సాకారం కానున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటవనున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల నిర్మాణంతో పాటు ప్రభుత్వ జనరల్ దవాఖానను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.235 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లాకో వైద్య కళాశాల ఉండాలన్నది ప్రభుత్వ అభిమతం. అందుకే వెనుకబడిన కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వం తొలుత ప్రాధాన్యమిచ్చింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన 20 ఎకరాలకు పైగా స్థలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. నిధులు మంజూరు కావడంతో చకచకా పనులు పూర్తి చేసి, వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకువచ్చేలా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
కొత్త జిల్లా ఏర్పాటుతో..
ఉత్తర తెలంగాణ జిల్లాలో మూడు జిల్లాలకు ముఖ్య కూడలిగా ఉన్న కామారెడ్డి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడింది. అభివృద్ధికి అవకాశమున్నా పాలకులు పట్టించుకోక పోవడంతో విద్య, వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పురుడు పోసుకున్న కామారెడ్డి జిల్లాకు పెద్దపీట వేశారు. కొత్త మున్సిపాలిటీలు, మండలాల ఏర్పాటుతో పాటు కావాల్సినన్ని నిధులు ఇవ్వడంతో మారుమూల ప్రాంతాల అభివృద్ధి సాధ్యమైంది. విద్య, వ్యాపార, వ్యవసాయ రంగంలో కామారెడ్డి దూసుకెళ్తున్నది.
హామీలను నిలబెట్టుకున్న సీఎం
కామారెడ్డి ప్రాంత వాసులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో గంప గోవర్ధన్ను ఎమ్యేల్యేగా గెలిపిస్తే కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేస్తానన్న మాట ఇచ్చారు. ఆ మేరకు జిల్లాను ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలు నిర్మించి పాలనను ప్రజల చెంతకు చేర్చారు. 2021 జూన్ 20న కలెక్టరేట్, పోలీసు భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సమయంలోనే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని హామీ ఇచ్చారు. స్థల ఎంపికతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన స్థలాన్ని సేకరించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించారు. సీఎం ఇచ్చిన మాట మేరకు మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించింది. కామారెడ్డి జిల్లాలో వైద్య కాలేజీ ఏర్పాటు, కళాశాల అప్గ్రేడ్ చేయడంతో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కామారెడ్డి డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు కేంద్ర భవనం చివరి దశకు చేరుకుంది. దాని పక్కనే మెడికల్ కళాశాలను నిర్మించనున్నారు. ఈ కాలేజీని జిల్లా కేంద్ర దవాఖానకు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అనువైన స్థలంతో పాటు వసతులు..
మెడికల్ కళాశాల ప్రారంభించాలంటే దానికి అనుబంధంగా 330 పడకల దవాఖాన ఉండాలి. కామారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుగుణంగా పడకల సంఖ్య పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మెడికల్ కళాశాలకు అవసరమయ్యే పడకలు, ఇతర పరికరాల విషయంలో ఇప్పటికే గతంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమీక్షించారు. కామారెడ్డిలో 100 పడకల దవాఖాన ఉండగా, దాన్ని అప్గ్రేడ్ చేశారు. మరో 100 పడకల మాతా శిశు కేంద్ర దవాఖాన నిర్మాణంలో ఉంది. కావాల్సినంత స్థలం, పడకలు అందుబాటులో ఉండడంతో కామారెడ్డికి వైద్య కళాశాల మంజూరైంది. దీంతో జిల్లాలో వైద్య సేవలు మరింత పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
కామారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు కృతజ్ఞతలు. పరిపాలన ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదలతోపాటు నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉంది.
– నిట్టు జాహ్నవి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్