విద్యానగర్, జూలై 28: సృజనాత్మకతను ప్రోత్సహించడం, సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం ఇవ్వాలని, సమాజంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలతో ముందుకు రావాలని, ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది. సమాజంలో ఉన్న ఆయా వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు నాంది పలికింది. 2019 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సామాజిక అంశాల పరిష్కారమే లక్ష్యంగా వారి ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ప్రయోగ రూపకల్పనకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ప్రతి ఒక్కరికీ అవకాశం…
ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేటర్ సెల్ను ఏర్పాటు చేసింది. సామాన్య గృహిణి నుంచి పాఠశాలలు, కళాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదారులు ఇలా ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రతి వ్యక్తిలోని సృజనాత్మకతను వెలికి తీసి స్థానిక సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహించనున్నారు. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల ప్రదర్శనను చేపట్టనున్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఆయా పాఠ శాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివరాలకు 94404 14250 నంబర్లో సంప్రదించవచ్చు.
వాట్సాప్ ద్వారా..
తమ ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్ట్ విషయాలతో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన ఆరు వ్యాఖ్యాలతో కూడిన ఆవిష్కరణ వివరణ, రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించి నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, మొబైల్ నంబ ర్, ప్రస్తుత వృత్తి, పూర్తి వివరాలు, అడ్రస్ను 91006 78543 నంబర్ వాట్సాప్కు పంపించవచ్చు. వచ్చిన ఆవిష్కరణల అంశాల నుంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొన్న వారికి కలెక్టర్ చేతుల మీదుగా టీఎస్ఐసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలను అందజేస్తారు.
ఆవిష్కరణ అంటే..
ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, ఒక కార్యక్రమం లేక మనలో కలిగే సృజనాత్మకత ఆలోచనే ఆవిష్కరణ. ఇలా ఆవిష్కరణ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంతోపాటు సమగ్ర అవగాహన కలిగి ఉండడం ఆవిష్కరణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉండే సమస్యలకు సంబంధించి వినూత్నంగా ఆలోచించి పరిష్కారానికి అవలంబించే పద్ధతి సైతం ఆవిష్కరణ అనిపించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఏదైనా వస్తువును విభిన్నంగా తయారు చేయగలిగిన వారే ఆవిష్కర్తలుగా గుర్తించబడుతారు. వారిలోని ప్రతిభను సమాజానికి తెలియజేసేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇది మంచి అవకాశం. దీనిని యువకులు, విద్యార్థులు, రైతులు, శాస్త్రవేత్తలు అన్నివర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే 94404 14250 నంబర్లో సంప్రదించాలి.
– సిద్దిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి