కమ్మర్పల్లి, జూలై 2 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూయార్క్ నగరంలో పర్యటించారు.ఫేస్బుక్ వేదికగా పర్యటనకు సంబంధించి వివరాలు, తన అనుభవాలను పంచుకున్నారు. ఇంజినీరింగ్ అద్భుతాల న్యూయార్క్ అని పేర్కొన్నారు.
న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఫ్రీడమ్ టవర్, ఎంపైర్ స్టేట్, ఎడ్జ్, సమ్మిట్, న్యూయార్క్ సబ్ వే స్టేషన్ అఫ్ ఫ్రీడమ్ టవర్, పెన్ స్టేషన్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఇవన్నీ ఇంజినీరింగ్లోని అద్భుతాలని..వీటిలోని ఆలోచనలను తెలంగాణలో అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు పాల్గొన్నారు.