నిజామాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) రోగమొస్తే ఒకప్పుడు ప్రైవేట్ దవాఖాన వైపు చూసే వారు. ఇప్పుడు సర్కార్ దవాఖానకు పరుగులు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో వైద్యరంగంలో విశేష మార్పులు వచ్చాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని గతంలో ప్రజలు పాటలు పాడుకున్న రోజులు పోయాయి. రోగమొస్తే ప్రభుత్వ దవాఖానలకే పరుగులు పెడుతున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ నాణ్యమైన సేవలు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానలు, ప్రభుత్వ జనరల్ దవాఖాన ఇలా వేటికవే ఉన్నతీకరణకు నోచుకుని కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయి. సర్కారు దవాఖానల్లో ప్రసవాలంటే ఆమడ దూరం పరుగెత్తే దుస్థితి నుంచి మహిళా లోకమంతా ప్రభుత్వ వైద్యం వైపే చూస్తుండడం విశేషం. మోకీళ్ల మార్పిడితో ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) ప్రైవేటుకు దీటుగా నిలిచినా, ప్రసవాలతో ఉచిత సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో ఆర్మూర్, బోధన్ ప్రాంతీయ దవాఖానలు పేరొందిన ఇదంతా సీ ఎం కేసీఆర్ పరిపాలన తీరుతెన్నులకు దర్పణం పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా భీమ్గల్ పీ హెచ్సీని 100 పడకల దవాఖానగా ఉన్నతీకరించేందు కు సర్కారు సిద్ధమవ్వగా.. మంత్రులు హరీశ్రావు, వే ముల ప్రశాంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.
నలుదిశలా వైద్య సేవలు..
నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్రతో సరిహద్దు ఉంది. అంతేకాకుండా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలతోనూ భౌగోళిక సరిహద్దును పంచుకుంటున్నది. జాతీయ రహదారులు, రైల్వే లైనుతో అనుసంధానమైన ఈ ప్రాంతం లో ఒకప్పుడు వైద్యమంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం లేదంటే హైదరాబాద్ మాత్రమే గుర్తుకొచ్చేది. అలాంటిది ఇప్పుడు జిల్లాలో నలుదిశలా ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటైన జనరల్ దవాఖానలో 500 పడకలతో మల్టీస్పెషాలిటీ సేవలు అందుతున్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ప్రజలకు పెద్ద దిక్కుగా నిలుస్తూనే ఉభయ జిల్లాల ప్రజలకు కొండంత అండగా మారిందీ దవాఖాన. బోధన్లో వంద పడకల సామర్థ్యంతో కూడిన జిల్లా దవాఖానలో వైద్య సేవలు భేషుగ్గా అందుబాటులోకి వచ్చాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలకు, బోధన్ ప్రాంత వాసులకు ఈ దవాఖాన ఇప్పుడు పెద్ద దిక్కయ్యింది. ఆర్మూర్ దవాఖాన ఏడాదిన్నర క్రితం 100 పడకల దవాఖానగా రూపాంతరం చెందడంతో వైద్యం అద్భుతహా అన్నట్లుగా కొనసాగుతున్నది. భీమ్గల్లో 100 పడకల దవాఖానకు శంకుస్థాపనతో త్వరలోనే నూతన భవనం అందుబాటులోకి వస్తే బాల్కొండ, నిజామాబాద్ రూరల్ వాసులకు ఎంతో ఉపయుక్తంగా మారనున్నది.
మాట నిలబెట్టుకున్న వేముల..
బాల్కొండ అనగానే ఒకప్పుడు వెనుకబాటుతనం గుర్తొచ్చేది. రహదారులు సరిగా ఉండేవి కావు. భీమ్గల్ సహా పల్లె ప్రజలు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్ద దవాఖాన కోసం నిజామాబాద్ లేదా ఆర్మూర్ వెళ్లాల్సి వచ్చేది. ఈ అధ్వాన పరిస్థితి నుంచి అక్కడి ప్రజలను బయట పడేయడానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నడుం బిగించారు. బల్దియా ఎన్నికల్లో, శాసనసభా ఎన్నికల సమయంలోనూ పట్టణ అభివృద్ధికి, 100 పడకల దవాఖాన ఏర్పాటుకు వేముల హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిని గాడిన పెట్టిన మంత్రి.. తాజాగా వంద పడకల దవాఖానను మంజూరు చేయించి తన మాట నిలబెట్టుకున్నారు.
మరోసారి ప్రేమ చాటుకున్న కేసీఆర్..
ఉద్యమ కాలం నుంచి బాల్కొండ నియోజకవర్గమంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎనలేని అభిమానం. మోతె గడ్డపై పిడికిలి బిగించిన మట్టి ముడుపు కట్టిన స్ఫూర్తితో స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్.. ఈ ప్రాంత అభివృద్ధిపై ఎల్లప్పుడూ శ్రద్ధ చూపిస్తున్నారు. దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయాలను నెరవేర్చడంతోపాటు అదే బాటలో నడుస్తున్న వేముల ప్రశాంత్రెడ్డి ఆకాంక్షలకు పెద్దపీట వేయడం ద్వారా బాల్కొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది. వెనుకబాటు నుంచి అభివృద్ధి పథంలో పయనిస్తున్న భీమ్గల్ పట్టణ చరిత్రలో వంద పండకల దవాఖాన ద్వారా మరో అభివృద్ధి ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్నది. భీమ్గల్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వంద పడకల దవాఖాన నిర్మాణం ద్వారా 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. రూ.35 కోట్లతో ఈ దవాఖాన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా మంత్రి వేముల లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
భీమ్గల్లో వందపడకల దవాఖాన శంకుస్థాపన , సభ ఏ ర్పాట్లను కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేం దర్, డీఎంహెచ్వో సుదర్శన్, డీసీవో తదితరులు ఉన్నారు.
పేదలకు ఉపయోగం..
ప్రైవేటు దవాఖానల్లో బిల్లుల బాధలకు భయపడి ప్రభుత్వ దవాఖానలో వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లేవాళ్లం. కానీ మండల కేంద్రంలో వంద పడకల దవాఖాన ఏర్పాటుతో పేదలకు చాలా ఉపయోగపడుతుంది. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. దవాఖానను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
-దొన్కంటి లావణ్య, గృహిణి, బాచన్పల్లి
హామీని నిలబెట్టుకున్నారు..
భీమ్గల్లో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దీంతో పేదలకు మంచి వైద్యం లభిస్తుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి నిలబెట్టుకున్నారు. మండల ప్రజల తరఫున ధన్యవాదాలు.
– నిచ్చమొల్ల రాజేశ్వర్,వ్యాపారి, భీమ్గల్
తెలంగాణ వచ్చిన తర్వాతే..
తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నది. ప్రజలకు మెరుగైన చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. మండలంలో వంద పడకల దవాఖాన నిర్మిస్తుండడంతో అందరికీ లబ్ధి చేకూరనున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రికి కృతజ్ఞతలు.
– తోపారం సురేందర్, భీమ్గల్
ప్రైవేటుకు దీటుగా ఉన్నాయి..
మా చిన్నతనంలో ప్రభుత్వ దవాఖానలంటే భయపడేవాళ్లం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త ప్రభుత్వ దవాఖానలను ప్రైవేటు దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దారు. అన్నిసౌకర్యాలు కల్పిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ గొప్పతనమే. వందపడకల దవాఖాన ఏర్పాటుతో ప్రజలకు వైద్యఖర్చులు మిగలనున్నాయి. దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన మంత్రికి ధన్యవాదాలు.
– కొండవత్రి లిఖిత,గృహిణి, భీమ్గల్