ఆర్మూర్, జూన్ 17: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నేతృత్వంలో ఎంపీపీ, ఎంపీటీసీలు శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి మండలంలోని పలు సమస్యలను వివరించారు.
నూతన గ్రామపంచాయతీలకు భవనాలు మంజూరు చేయాలని, సీసీ రోడ్డు పనుల బకాయిలను చెల్లించాలని, గ్రామాలు, మండలాల మధ్య లింక్ రోడ్లు నిర్మించాలని కోరారు. మచ్చర్ల నుంచి జోర్పూర్కు నిధులు ఇచ్చి మండల అభివృద్ధికి తోడ్పాటునందించాలని, రోడ్లకు మరమ్మతులు చేయించాలని మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎంపీపీ పస్క నర్సయ్య, వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎంసి.గంగారెడ్డి తదితరులు ఉన్నారు.