శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఐదో రోజైన బుధవారం నిర్వహించిన క్రతువులు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రతిష్ఠించబోయే దేవతామూర్తులకు శోభమ్మ, ఎమ్మెల్సీ కవిత – అనిల్కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మూలమంత్ర హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, చతుస్థానార్చన, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నవ నారసింహ పూజలో భాగంగా ఉగ్ర, కృద్ధ, వీర, విలంబ,కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీలక్ష్మీ నృసింహ ఆరాధన చూడముచ్చటగా సాగింది. నేటితో ప్రతిష్ఠాపనోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.
నందిపేట్, జూన్ 8 : జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది వంద కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీని వల్ల ప్రజలు, దేశానికి క్షేమం కలుగుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనంఅనుసారం చౌడమ్మ కొండూర్లో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత- అనిల్కుమార్ దంపతులు తలపెట్టిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయం జీర్ణోద్ధరణ, శిలామయ, లోహమయ మూర్తుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కుంభాభిషేక కార్యక్రమాలు, ఐదు రోజులుగా అంగరంగ వైభోవంగా సాగుతున్నాయి.
ఐదో రోజైన బుధవారం సీఎం కేసీఆర్ సతీమణి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృమూర్తి కల్వకుంట్ల శోభ పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రతిష్ఠించనున్న మూర్తులకు జల, క్షీర, పుష్ప, ఫల, ధన, ధాన్య, శయ్యాధివాసాల క్రతువులు శాస్త్రోక్తంగా సాగాయి. నవనారసింహ పూజ రుత్వికుల శ్రేణి, పాంచరాత్ర ఆగమ శాస్త్ర అనుసారం నిర్వహిస్తున్న కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురు పరంపరకు నమస్కరిస్తూ ప్రాతఃఆరాధనతో మొదలైన కార్యక్రమాలు మూలమంత్ర మూర్తి మంత్ర హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, చతుఃస్థానార్చన, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. నవ నారసింహ పూజలో భాగంగా ఉగ్ర, కృద్ధ, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీలక్ష్మీ నృసింహ ఆరాధన చూడముచ్చటగా సాగింది.
నృసింహ కరవలంబం, నృసింహ స్తోత్రాలు, అనంత భక్తిశ్రద్ధలతో పఠించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేసి పవిత్ర నృసింహ మాలను అర్చకుల చేతుల మీదుగా ధరింపజేశారు. ఈ కార్యక్రమాల్లో యజమానులుగా కల్వకుంట్ల కవిత- అనిల్కుమార్ దంపతులు కార్యనిర్వహణ చేయగా, రాంకిషన్రావు-నవలత, ననిత- అరుణ్కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉత్సవాల చివరి రోజు కార్యక్రమాలు
గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రాతఃఆరాధనతో ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 7.56 గంటలకు హస్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున మహాకుంభ ప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం విగ్రహాల స్థాపన శాంతి కల్యాణం, మహాదాశీర్వచనం నిర్వహిస్తారు. ఆరు రోజులుగా అశేష భక్తజన సందోహం మధ్య శాస్రోక్తంగా భక్తిశ్రద్ధలలో సాగిన ప్రతిష్ఠాపన క్రతువు ముగియనున్నది.
ప్రముఖుల రాక : ఆలయ సందర్శనకు ప్రముఖులు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దంపతులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, జీవన్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు కమలాకర్రావు, పండిత అబ్దుల్లా, కృపాల్సింగ్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు.