రెంజల్, జనవరి 30: కొన్నిరోజుల క్రితం చోరీకి గురైన మండలంలోని కందకుర్తిలో ఉన్న అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన రామాలయంలోని ఉత్సవ విగ్రహాలు ఊహించని విధంగా తిరిగి ఆలయానికి చేరాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 8వ తేదీన నిత్యపూజల కోసం వెళ్లిన ఆలయ ధర్మకర్త ఆనంద్కుమార్ సతీమణి ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆలయంలోని పంచలోహాలతో తయారు చేసిన ఉత్సవ మూర్తులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 350ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలు చోరీ కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో స్థానికులతో పాటు పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు నిందితులను పట్టుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈనెల 25న మహారాష్ట్రలోని నాందెడ్కు వచ్చిన శంకరాచార్యుల వారిని సంప్రదించారు. ఆలయానికి అరిష్టం తొలగిపోవాలంటే ఆలయంలో అన్నదానం చేయాలని సూచించారు. అదేరోజున ఆలయానికి ఓ వ్యక్తి ఆటోలో వచ్చా డు. ఆలయంలో అన్నదానం చేయాలని తనతోపాటు ఓ వ్యక్తి బియ్యం పంపాడని చెబుతూ రెండు సంచుల బియ్యం, రవ్వతో పాటు ప్రత్యేకంగా సరుకుల డబ్బాను తీసుకువచ్చాడు. ఆలయంలో హారతి కార్యక్రమానికి వచ్చిన కందకుర్తి గ్రామానికి చెందిన సంతోష్, బుచ్చన్నకు వాటిని అప్పగించాడు. ఫిబ్రవరి ఒకటిన అన్నదానం చేసేందుకు ఆలయానికి పంపిన బియ్యం సంచులతో పాటు ప్రత్యేకంగా సరుకులు పంపించామని సదరు వ్యక్తి చెప్పిన డబ్బాను ఆదివారం విప్పి చూడగా ఉత్సవ విగ్రహాలు కనిపించడంతో అం దరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు వ్యక్తి మ హారాష్ట్రలోని ఉమ్రి నుంచి వచ్చానని చెప్పి బి య్యం, డబ్బాలను అప్పగించి వెళ్లిపోయాడు. ఉత్సవ మూర్తులు ఊహించని రీతిలో ఆలయానికి తిరిగి రావడంపై ఆలయ ధర్మకర్తతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై ధర్మకర్త ఆనంద్కుమార్ రెంజల్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా, జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నామని ఇన్చార్జి ఎస్సై నర్సయ్య తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి విచారణ జరిపించి అసలు విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.