కంటికి కనిపించని కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్న జనజీవనానికి పెరుగుతున్న ధరలు మళ్లీ ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతున్నది. ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా ధరలను పెంచుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతుండగా.. పెరిగిన వంట నూనె ధరలు సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. డీజిల్ ధర అమాంతం హద్దులు దాటడంతో సరుకు రవాణా ఖర్చులు పెరిగి పరోక్షంగా అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నది. అన్నదాతలకు సైతం వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం ఇష్టారాజ్యంగా పెంచుతుండడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
నిజామాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండేండ్లుగా వెంటాడుతున్న కరోనా బారి నుంచి సామాన్యులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అంతలోనే ధరల పెరుగుదల వారిని అతలాకుతలం చేస్తున్నది. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం ధరలు చుక్కలను అంటుతున్నాయి. రోజువారీగా పైసా చొప్పున సున్నితంగా పెంచుతున్న ఇంధన ధరలతో ఆల్ టైం గరిష్టానికి పెట్రోల్, డీజిల్ చేరుకున్నది. వందల రూపాయల వడ్డనతో వంట గ్యాస్ ధర రూ.వేయి దాటి రూ.11వందలకు చేరింది. ఇంధన మంటతో రవాణాపై పెను ప్రభావం చూపడంతో నిత్యావసరాలు, అత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు రూ.వంద జేబులో పెట్టుకుని మార్కెట్కు వెళ్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. మొన్నటి వరకు రూ.200 నోటుతో వెళ్తే సరిపోయేది. ఇప్పుడు రూ.300 తీసుకెళ్లినా వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మూలంగానే ఈ దుస్థితి ఏర్పడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించడంతో తీవ్రమైన సంక్షోభంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.
వంట నూనె సలసల…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. గరిష్ఠ చిల్లర ధరపై అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. వంట నూనె ప్యాకెట్పై ఎమ్మార్పీ రూ.130 ఉంటే దాన్ని రూ.230 వరకు చేర్చారు. దీంతో కిలో వంట నూనె(సన్ఫ్లవర్) ఆయా బ్రాండ్లను బట్టి రూ.200లకు తక్కువగా రావడం లేదంటే అతిశయోక్తి లేదు. వంట నూనెల విక్రయంపై అధికారులు మొక్కుబడి తనిఖీలు వ్యాపారుల దందా కు ఊతమిస్తున్నాయి. ఇదేంటని సామాన్యులు ప్రశ్నిస్తే వ్యాపారులు నూనె అమ్మకాలను నిలిపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన లు గత నెలలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వెలుగు చూశాయి. వంట నూనె 5 లీటర్ల క్యాన్ ధర రూ.950 నుంచి రూ.1000 వరకు చేరింది. సరాసరి రూ.300 నుంచి రూ.400 వరకు పెంచేసి అమ్ముతున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలైతే ఆఫర్ల పేరిట పనికి రాని ఉత్పత్తులను అంటగట్టి రూ.1200లకు 5లీటర్ల నూనెను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటుండడం కనిపిస్తోంది. వంట నూనెల ధరల పెరుగుదల మూలంగా తిండి తినడానికి కూడా సామాన్యులు జంకే దుస్థితిని మోదీ సర్కారు తీసుకు వచ్చింది.
నగదు ఆవిరి…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వాహనదారుల జేబుల్లో నగదు ఆవిరవుతున్నది. రోజుకు పైసా చొప్పున ప్రజలకు తెలియకుండా అర్ధరాత్రుల్లో పెరుగుదలను నమోదు చేసి జనానికి కేంద్ర ప్రభుత్వం వాత పెడుతున్నది. సరిగ్గా ఏడాది కింద ట రూ.80కి లీటర్ పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.121కి చేరింది. డీజిల్ ధర రూ.107తో ముప్పుతిప్పలు పెడుతున్నది. వాణిజ్య వాహనాలన్నీ డీజిల్ ఆధారితంగానే పని చేస్తున్నాయి. డీజిల్ ధర అమాంతం హద్దులు దాడడంతో సరుకు రవాణా ఖర్చులు పెరిగి పరోక్షంగా అన్ని వస్తువుల ధరలు ఎగబాకడం మొదలైంది. దీంతో ఏమి తినేటట్టు లేదు. ఏమి కొనేటట్టు లేదు… అన్న చందంగా సామాన్యు ల పరిస్థితి నెలకొన్నది. నెలవారీగా రూ.10వేల నుంచి రూ.20వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకునే వారి దుస్థితి మోదీ ప్రభుత్వంలో లబోదిబోమనేలా తయారైంది. నెలవారీ జీతంలో నిత్యావసరాలు, ఇంధన ఖర్చులు, ఇంటి కిరాయిలకే 80 శాతం వెచ్చించాల్సి వస్తోంది. గతంలో మొత్తం జీతంలో 30శాతం పొదుపు చర్యలపై దృష్టి సారించేది. ఇప్పుడు సగటు కుటుంబాల పొదుపు చర్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వంతో దెబ్బపడింది.
రైతు ఆగమాగం…
ఇంధన ధరలు పెరగడం మూలంగా సామాన్య ప్రజలతో పాటు అన్నదాతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. పల్లెటూర్లో వ్యవసాయం చేసుకునే వారికి పెరిగిన డీజిల్ ధరలను చూస్తే గుండె గుభేల్ మంటోంది. 2020 జూన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.49 ఉంది. ప్రస్తుతం రూ.121 చేరింది. దాదాపు రూ.45 వరకు అదనపు భారం పడుతున్నది. డీజిల్ సైతం రూ.69.15 ఉండగా ఇప్పు డు లీటర్ డీజిల్ రూ.107 పలుకుతున్నది. డీజిల్పైనా దాదాపు రూ.38 పెరిగింది. ఇంతటి పెను భారంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. వరి సాగు చేసే రైతుపై ఏడాదికి ఎకరాకు అదనంగా రూ.3వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతున్నది. ఇతర పంటలు సాగు చేసే వారిపై రూ.2వేల వరకు అదనపు వ్యయం వెచ్చించాల్సి వస్తోంది. దుక్కి దున్నడం, నాట్లు వేయడం, పంట కోత, గడ్డి కట్టలు కట్టడం, మట్టి తరలింపు, పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించడం ఇలా అన్నింటిపైనా పెరిగిన డీజిల్ ధర ప్రభావం చూపుతున్నది. వాహన యజమానులు అద్దె పెంచుతున్నారు. గతేడాది ట్రాక్టర్ గంటకు రూ.1100 ఉండగా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో రూ.1400 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. యాసంగిలో వరి కోత మిషిన్ ధరలు సైతం ఎగబాకాయి.
అగ్గి రాజేస్తున్న పండ్లు, కూరగాయలు…
మార్కెట్లో పండ్లు, కూరగాయల ధరలు అగ్గిరాజేస్తున్నాయి. హోల్సేల్, రిటైల్ ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. నిజామాబాద్లో క్యాప్సికం కిలో రూ.70, వంకాయ రూ.38, దోసకాయ రూ.32, దోసకాయ(మద్రాస్) రూ.19, సొరకాయ ఒకటి(కిలో) రూ.29, దొండకాయ కిలో రూ.32, బీరకాయ రూ.68, క్యారెట్ కిలో రూ.48, బెండకాయ కిలో రూ.32, పాలకూర ఒక కట్ట రూ.12(300గ్రాములు), బీన్స్ కిలో రూ.128 పలుకుతున్నది. పండ్ల ధరలు సైతం విపరీతంగా ధరలు పలుకుతున్నాయి. వేసవి సీజన్లో విరివిగా దొరికే మామిడి పండ్లు ఈసారి తక్కువ దిగుబడి మూలంగా కిలో రూ.100 వరకు లభిస్తుండగా సీజన్ ఆరంభం నుంచి పుచ్చకాయ ధర కిలో రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతున్నాయి. యాపిల్, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కీవీ ఫ్రూట్ వంటి దిగుమతి చేసుకునే పండ్ల ధరలు చెప్పరాకుండా మారాయి.
అన్ని వస్తువుల ధరలు పెరిగాయి
పెంచిన పెట్రోల్ ధరల కారణంగా పప్పుల రేట్లు కూడా పెరిగాయి. మేం ప్రతి సంవత్సరం పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి పప్పులు తెచ్చుకునే వాళ్లం. బండి తీసుకుని వెళ్లాలంటే పెట్రోల్ ధర పెరగడంతో అదనపు భారం పడడంతో పాటు పప్పుల రేట్లు ఎక్కుగానే ఉన్నాయి. స్థానికంగా వర్తకులు బోధన్, నిజామాబాద్ ప్రాంతాల కన్నా ఎక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.
-ఎస్. నాగేశ్వర్ రావు, ఎడపల్లి
కూరగాయల ధరలను పెంచేశారు
ఇప్పుడున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో అన్ని రకాల వ్యాపారులు వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు.నిజామాబాద్, బోధన్ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే రవాణా చార్జీలు పెరిగాయని తక్కువ ధరకు అమ్మితే గిట్టుబాటు కావడం లేదని సమాధానం చెబుతున్నారు.
-వై.రమేశ్, ఎడపల్లి
టమాట కిలో రూ.50 అయ్యింది
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో అన్ని వస్తువులపై ప్రభావం చూపుతున్నది. కూరగాయల రవాణా భారంగా మారడంతో ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.50 అయ్యింది. ప్రతి మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో వారాంతపు సంత జరుగుతుంది. అంగడికి వెళితే కూరగాయల ధరలను చూసి అరకొర మాత్రమే కొనుగోలు చేశాను.
-మల్లుగొండ, కిష్టాపూర్, బీర్కూర్ మండలం
పప్పుల ధరలకు రెక్కలు
వారంలో సగం రోజులు పప్పు కూర లు తినడం అలవాటయ్యింది. అంగ ట్లో పప్పులను కొందామంటే వాటికి రెక్కలు వచ్చాయి. వ్యాపారులను కూడా ఏమీ అనలేని పరిస్థితి. రవాణా వ్యయం పెరగడంతోనే వారు ధరలను పెంచుతున్నారు. మాకు కొంతదూరంలోనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఉంటాయి. అక్కడ పండించే ప్రధాన పంటలైన పప్పు దినుసుల ధరలు సైతం అమాంతం పెరిగాయి.
– రాములు, కిష్టాపూర్ గ్రామం, బీర్కూర్ మండలం.