నిజామాబాద్సిటీ, ఫిబ్రవరి 23 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుల నుంచి తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా చూడాలన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 123, బోధన్ డివిజన్లో 30, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 54 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నాయ ని, మళ్లీ నిర్వహించే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి ఉండాలన్నారు. పోలీస్ కమిషనర్ నాగారాజు మాట్లాడుతూ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధితులకు సరైన రీతిలో, సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలే.. కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు. పోలీసు శాఖ తరఫున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శశికళ, ఏసీపీలు, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.