ఇందూరు, ఏప్రిల్ 20: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకొని మంటలను అదుపులోకి తెస్తూ.. ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరుగకుండా సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా.. ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండ్లు, కార్యాలయాలు, దవాఖానాలు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి ఉన్న అవకాశాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మంటలు వ్యాపించినప్పుడు ప్రమాదాల బారినుంచి ఎలా బయటపడాలి..దట్టంగా పొగలు కమ్ముకొన్నప్పుడు ఎలా బయటికిరావాలి.. అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటో వివరిస్తున్నారు.
వారం పాటు అవగాహన కార్యక్రమాలు..
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి జి ల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జనం రద్దీగా ఉం డే ప్రాంతాలు, దవాఖానలు, కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్లు, పెట్రోల్ బంకులు , మార్ట్ లు, అపార్ట్మెంట్లు, గ్యాస్ సరఫరా కేంద్రాల వద్ద డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
నేరుగా 101కు ఫోన్…
అగ్ని ప్రమాద సమయంలో ప్రతి క్షణం ఎంతో కీలకం. వీలైనంత త్వరగా అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగలిగితే .. అంత ఎక్కువ నష్టం కలుగకుండా నివారించినవారమవుతాం. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడొచ్చు. అందుకోసం ఎవరైనా సరే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు ఫోన్ చేసి వివరాలను తెలియజేయాలి. ఎలాంటి కంగారు లేకుండా ప్రమాద సంఘటన గురించి వివరించాలి. అలా చెప్పినప్పుడే వివరాలను నమోదు చేసుకొని అగ్నిమాపక సిబ్బంది వెంటనే సేవలకు ఉపక్రమించడానికి ఆస్కారం ఉంటుంది.
నిజామాబాద్లో ఐదు కేంద్రాలు..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఐదు ఫైర్ స్టేషన్లున్నాయి. నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి ఫైర్స్టేషన్లో 15 మంది సిబ్బంది, ఒక ఫైర్ ఆఫీసర్ మొత్తం 16 మంది ఉద్యోగులు ఉంటారు. ఏడుగురు డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం ఆరు ఫైరింజన్లు, ఒక రెస్క్యూ వెహికిల్, రెండు బుల్లెట్స్, మినీ ఫైర్ టెండర్స్ అందుబాటులో ఉన్నాయి.
వేసవిలో అగ్ని ప్రమాదాలు
ప్రధానంగా వేసవి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో గుడిసె లు, గడ్డివాములు అగ్ని ప్రమాదాల్లో తగులబడి పోతాయి. అట వీ ప్రాంతాల్లో గుట్టలు, అడవులు కాలిపోతూ ఉంటాయి. నగరాల్లో అయితే గ్యాస్ లీక్, విద్యుదాఘాతంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉం డాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎల్లప్పుడూ అందుబాటులో..
అత్యవసర సేవలు అందించడానికి మా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అందుకోసం కేంద్రాల వద్ద పగలు, రాత్రి విధులు నిర్వర్తించే వారు సమానంగా ఉంటారు. ప్రతి వాహనానికి కావాల్సిన సిబ్బంది విధు ల్లో ఉంటారు. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుం డా వారం రోజుల పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించాలి. ఇంట్లో ఐఎస్ఐ గుర్తింపు ఉన్న వైర్లను మాత్రమే వాడాలి.
-మురళీమనోహర్రెడ్డి, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి, నిజామాబాద్
ఫైర్ సెఫ్టీ నిబంధనలు ఇవే
15 మీటర్ల ఎత్తుదాటిన ప్రతి వ్యాపార సముదాయాలకు, గృహాలకు ఫైర్ యాక్ట్ ప్రకారం ఫైర్ సేఫ్టీ మెజర్స్ కల్పించాలనే నిబంధన ఉండేది. కానీ 2009 సంవత్సరం తర్వాత నిర్మించిన 15మీటర్ల ఎత్తు దాటిన ప్రతి గృహ, వ్యాపార సముదాయాలకు మాత్రమే ఫైర్ సేఫ్టీని కచ్చితం చేసింది. పాఠశాలల చుట్టూ ఆరు మీటర్ల రోడ్డు వదిలేయాల్సి ఉంటుంది. వ్యాపార సముదాయాలకు మున్సిపల్ యాక్ట్ ప్రకారం నిబంధనలు వర్తిస్తాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా తనిఖీల్లో పట్టుబడితే చట్టపరమైన చర్యలుంటాయి. ఒక్కోసారి జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా వేయవచ్చు.