దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండలకేంద్రంతోపాటు ముత్యంపేట, అంబారీపేట, సీతారాంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచులు అంజలి, నాంపల్లి, సలీం, సూర్యప్రకాశ్ అధ్యక్షతన శనివారం గ్రామసభలు నిర్వహించారు. దోమకొండలో నిర్వహించిన గ్రామసభ వాడీవేడిగా జరిగింది. గ్రామ పం చాయతీకి చెందిన ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతు లు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు, పంచాయతీ కార్యదర్శి, జీపీ పాలకవర్గానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య కోరారు. గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయం రోడ్డుకు మొరం వేసిన ఖర్చు వివరాలు తెలుపాలని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామంలోని బయన్న కుంటను కొంతమంది కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామసభకు పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పల్లెప్రగతి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో తిరుపతి, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సౌజన్య, అరుణ, బాబు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి, నాచుపల్లి, దుర్కి, బొమ్మన్దేవ్పల్లి తదితర గ్రామాల్లో శనివారం గ్రామ సభలు నిర్వహించారు. హరితహారంలో భాగంగా మొక్కలునాటి సంరక్షించాలని తీర్మానం చేశారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీబీపేట మండల కేంద్రంతోపాటు యాడారంలో సర్పంచులు లక్ష్మి, ఎంపీడీవో నారాయణ, వెంకట్రావు అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామసభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు సాయినాథ్, హరీశ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, బాలకృష్ణాగౌడ్, ఏఈవో లత, ఏఎన్ఎంలు, వార్డుసభ్యులు, ఆశవర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలంలోని బీర్కూర్, బరంగేడ్గి గ్రామాల్లో శనివారం గ్రామసభలను నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచులు అవారి స్వప్న, పసుపుల లక్ష్మి, ఉపసర్పంచులు షాహిన్బేగం, నాచారం రాములు, కార్యదర్శులు శ్రీనివాస్, వినోద్ రాథోడ్, గ్రామపెద్దలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
జుక్కల్ మండలంలోని పెద్దగుల్లా గ్రామంలో సర్పంచ్ రుక్మిణీబాయి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రా మంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంగన్వాడీ, వైద్యశాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాల ని కోరారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ జమా ఖర్చుల నివేదికను చదివి వినిపించారు.
పిట్లం మండలంలోని కుర్తిలో సర్పంచ్ మహిపాల్రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు. సిద్ధాపూర్లో సర్పంచ్ సక్రూసింగ్, కోమటిచెరువుతండా సర్పంచ్ దేవారావు, గౌరారంలో సర్పంచ్ అనసూయ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు అశోక్, హన్మంత్రావు, పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, భారతి, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, హన్మాజీపేట్లో సర్పంచులు కుమ్మరి రాజమణి, బోనాల సుభాష్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమని, సీఎం కేసీఆర్కు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు పలు సమస్యలు గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు. కార్యదర్శులు రాజేశ్, ప్రశాంతి, ఎంపీటీసీలు సుధాకర్రెడ్డి, నూకల ఇందిర, ఉపసర్పంచ్ అక్బర్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కుమ్మరి రాజు, లక్ష్మాగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తాడ్వాయి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ఎంపీవో హప్సిబా హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మురికికాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్తను ప్రతిరోజూ ట్రాక్టర్లో డంపింగ్యార్డుకు తరలించాలని సూచించారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలను నిర్మించాలని గ్రామస్తులు కోరారు.
అర్హులందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ సంజీవులు, వైస్ ఎంపీపీ నర్సింహులు, ఉపసర్పంచ్ మణెవ్వ, పంచాయతీ కార్యదర్శి భవానీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.