బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సొంత స్థలాల్లో నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులు, నాయకులకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో పట్టణంతోపాటు తాడ్కోల్ నాయకులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజారాం దుబ్బ ప్రాంతంలో వెంటనే పర్యటించి లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని సూచించారు. దగ్గరుండి పనులను ప్రారంభించి సేవలు అందించాలన్నారు. బాన్సువాడ కేసీఆర్ నగర్, పీఎస్ఆర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసుల కోసం ఆర్టీసీ బస్సును ప్రతిరోజూ మూడు ట్రిప్పులు నడిపించాలని ఆర్ఎంకు ఫోన్ద్వారా సూచించారు. అదే కాలనీతో పాటు బీడీ వర్కర్స్కాలనీలో చిన్నారులను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీడీపీవో అనురాధను ఆదేశించారు. పీఎస్ఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ను ఆదేశించారు. లబ్ధిదారులు వారి తల్లి దండ్రులను వెంట ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పాలని నాయకులకు స్పీకర్ పోచారం సూచించారు.
ఐదో తేదీన తాను హైదరాబాద్ నుంచి తిరిగి వస్తానని ఆలోపు లబ్ధిదారుల వివరాలను సిద్ధం చేయాలని సూచించారు. పట్టణంలో తాను పర్యటించిన సమయంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మహ్మద్ ఎజాస్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, గోపాల్ రెడ్డి, భూషణ్ రెడ్డి, గంగుల గంగారాం, రాజు, లక్ష్మాగౌడ్, రాజు, నస్రుల్లాబాద్ ఎంపీపీ పాల్త్య విఠల్, సీడీపీవో అనురాధ, సూపర్వైజర్ సౌ భాగ్య, ఎంఈవో నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ ఏడీ వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.