ఉమ్మడి జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. పలు మండలాల్లో వడగండ్ల వాన కురవగా పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అభయహస్తం కాలనీలోని గుడిసెలు కూలిపోయాయి. పలు మండలాల్లోని ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టంతోపాటు మామిడికాయలు నేలరాలాయి. కోటగిరి మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయాధికారులు ఆదివారం పరిశీలించారు. వర్ని మండలంలోని సిద్దాపూర్, పైడిమల్, జలాల్పూర్ గ్రామ శివారులోని మక్కజొన్న పంట నేలకొరిగింది.
ఖలీల్వాడి,మార్చి 17: నిజామాబాద్ జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షానికి జిల్లా వ్యాప్తంగా 3076 మంది రైతులకు చెందిన 6058 ఎకారాల్లో పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.బాల్కొండ, మెండోరా మండలాల్లోని 64 ఎకరాల్లో పంట దెబ్బదినగా.. 80 మంది రైతులు నష్టపోయారు.
బాన్సువాడ, వర్ని మండలాల్లోని రెండు గ్రామాల్లో 118 ఎకరాల్లో పంట దెబ్బతినగా 95 మంది రైతులకు నష్టం వాటిల్లింది.జిల్లా వ్యాప్తంగా 44 గ్రామాల్లో 6058 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా..3076 మంది రైతలు నష్టపోయారు. ఇందులో 5661 ఎకరాల్లో వరి (2812 మంది రైతులు), 292 ఎకరాల్లో మక్కజొన్న( 169), 93 ఎకరాల్లో జొన్న (80 మంది రైతులు), 12 ఎకరాల్లో నువ్వుల (15 మంది రైతులు) పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి, మార్చి 17: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 20,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 మంది రైతుల చెందిన పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు కొత్తిమీర, గోధుమ, ఉల్లి, బోప్పాయి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారుల నుంచి వచ్చిన తాత్కాలిక అంచనా నివేదిక మేరకు వరి ధాన్యం 16,298 ఎకరాలు, మక్క జొన్న 2,784, జొన్న 705 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. నిజాంసాగర్, బీబీపేట, రాజంపేట,బాన్సువాడ, డోంగ్లీ, దోమకొండ, భిక్కనూర్ తదితర మండలాల్లో జొన్న, వరి, మక్కజొన్న పంటలు నేలవాలాయి. భిక్కనూరు మండలంలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి ,జంగంపల్లి తదితర గ్రామాల్లో పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లగా.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఆదివారం పరిశీలించారు.
నస్రుల్లాబాద్, మార్చి 17: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.బీర్కూర్ మండలం చించోల్లి, కిష్టాపూర్, అన్నారం గ్రామాల పరిధిలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు. పంట నష్టంపై కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లకు ఫోన్ చేసి వివరించారు.
నష్ట పోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. రెవెన్యూ,వ్వవసాయ అధికారులు తక్షణమే క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలో వరి ధాన్యం కోతలు మొదలయ్యాయి, వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.