వేల్పూర్, ఆగస్టు 10 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంద్రాగస్టు రోజు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో దాదాపు కోటీ 20 లక్షల నివాసాలు ఉన్నాయని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడితే గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సావాల్లో భాగంగా వేల్పూర్ మండలం పడిగెల్ శివారులో బుధవారం వనమహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్రీడం పార్కులో మంత్రి మొక్కను నాటారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు ఏకకాలంలో 750 మొక్కలు నాటారు. అనంతరం త్రివర్ణ పతాకాలతో దేశభక్తి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వజ్రోత్సవాల్లో భాగస్వాములై దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.
దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని ప్రసాదించేందుకు అనేక మంది త్యాగధనులు కృషి చేశారని, వారిని స్మరిస్తూ నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజులపాటు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే వనమహోత్సవాన్ని నిర్వ హించామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సునీల్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.