ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దేశభక్తి ఉట్టిపడేలా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన బుధవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రీడమ్ పార్కుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మొక్కలను నాటి స్ఫూర్తి నింపారు. థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శన కొనసాగింది. నవీపేట్, నిజాంసాగర్లలో వెయ్యి అడుగుల భారీ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామశివారులోని ఎక్స్ రోడ్డులో ఫ్రీడమ్ పార్కులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏకకాలంలో 750 మొక్కలను నాటారు. బాన్సువాడ మండలం జక్కల్దాని తండాలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం మొక్కలను నాటి స్థానికులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 10
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని నగరపాలక సంస్థ వరకు జెండాలను పంపిణీ చేశారు. పలుచోట్ల ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చెతబట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఊరూవాడా త్రివర్ణ శోభితమైంది.