ఖలీల్వాడి, నవంబర్ 28 : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సం బంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని నిజామబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు చేసిన నిర్ణీత వ్యవధిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డీసీవో సింహాచలం, డీఆర్డీవో చందర్, మెప్మా పీడీ రాములును ఆదేశించారు. కాగా శాఖాపరమైన పనులు పెండింగ్లో ఉండకుండా, వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖలు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్యాలయం ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని, రహదారులకిరువైపులా మొక్కల పెంపకం, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. అవసరం లేకపోయినా సిజేరియన్ కాన్పులు చేసే ప్రైవేట్ దవాఖానలపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక పరిశీలన బృందాలు తనిఖీలు నిర్వహించాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన గైనకాలజిస్ట్లను నియమించుకోకుండా సిజేరియన్లు చేస్తున్న దవాఖానలను సీజ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక, మొరం అక్రమ రవాణాకు ఆస్కా రం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, అదే సమయంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.
ప్రభుత్వానికి నిర్దేశిత సీనరేజ్ చెల్లించి ఇసుక, మొరం తరలించేందుకు అనుమతించాలన్నారు. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని, సెలవు దినాల్లో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణికి 71 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెం డింగ్లోని అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, జడ్పీ సీఈవో గోవింద్లకు విన్నవించారు.