అధికారులను ఆదేశించిన నిజామాబాద్ కలెక్టర్
పట్టా భూమిని అంగుళం కూడా తీసుకోబోమని భరోసా ఇచ్చిన నారాయణరెడ్డి
ఇందూరు, జూన్ 22: నిజామాబాద్ జిల్లాలోని జలాశయాలకు చెందిన ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి వెంటనే హద్దులను ఏర్పాటుచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. అడ్డుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్, ఉపాధిహామీ, రెవెన్యూ, మండల పరిషత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువలు, చెరువులకు చెందిన స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రెంచ్ కటింగ్ చేయించాలని వారంపాటు గడువు విధించారు. కాలువలకు చెందిన స్థలాల్లో ఇకపై పంటల సాగును అనుమతించకూడదని స్పష్టం చేశారు.
రైతులకు చెందిన పట్టా భూముల్లో ఒక్క అంగుళం స్థలాన్ని కూడా తీసుకోబోమని భరోసా ఇచ్చారు. ఇరిగేషన్ ఏఈలతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తక్షణమే ఆక్రమణల తొలగింపు పనుల్లో నిమగ్నం కావాలని బాధ్యతలు పురమాయించారు. ముందుగా కాలువలు, చెరువు గట్లతోపాటు వాటి పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి మూడు మీటర్లకో మొక్క నాటేందుకు గుంతలు తవ్వించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 652 కిలోమీటర్ల మేర కెనాల్ బౌండరీ ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఈ విడుత హరితహారంలో రెండు కిలోమీటర్ల మేర మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ఎస్ఈ బద్రీనారాయణ, ఉపాధిహామీ అధికారి సంజీవ్, వివిధ శాఖలకు చెందిన ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.