కలెక్టర్ జితేశ్ పాటిల్
పలు గ్రామాల్లో అధివృద్ధి పనులు, పీహెచ్సీలు, జీపీల తనిఖీ
నిజాంసాగర్/ పిట్లం/లింగంపేట/ మద్నూర్, సెప్టెంబర్ 24 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం, లింగంపేటలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు చేపట్టిన వ్యాక్సినేషన్ వివరాలపై ఆరా తీశారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు వేయాలన్నారు. పిట్లం ప్రభుత్వ దవాఖానలో రాత్రి వేళ విద్యుత్ సమస్య ఉంటున్నదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం పిట్లం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ను సన్మానించారు. తహసీల్ కార్యాలయంలో ధరణి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ కవితా విజయ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, వైద్యాధికారులు శివకుమార్, రోహిత్కుమార్ తదితరులు ఉన్నారు.
పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో వ్యాక్సినేషన్, అంగన్వాడీ కేంద్రాలను, పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వ, ఆయకట్టు వివరాలను డీఈఈ దత్తాద్రిని అడిగి తెలుసుకున్నారు. కౌలాస్ గ్రామంలో జీపీ రికార్డులను, పల్లె ప్రకృతివనాన్ని, జుక్కల్ మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీలు ప్రతాప్రెడ్డి, యశోదా నీలూపటేల్, ఎంపీడీవో గణేశ్, రాణి, మండల ప్రత్యేకాధికారి ఆంజనేయులు ఉన్నారు.
మద్నూర్ మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నందున కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలను శుక్రవారం తనిఖీ చేశారు. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయించాలని, సర్వే చేపట్టి ఇండ్లకు స్టిక్కర్లు అంటించాలని సూచించారు. తహసీల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో పరిశీలించారు. కార్యాలయ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని అధికారులకు సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులను నియమించాలని సర్పంచ్ దరాస్ సురేశ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వెంకటనర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్పటేల్, వైస్ ఎంపీపీ జైపాల్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు దీన్దయాళ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో ఇప్పటివరకు 63 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, త్వరగా వంద శాతం పూర్తిచేయాలని మండల వైద్యాధికారి రాధాకిషన్కు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సమస్యలపై సర్పంచ్ అమీనాబీని అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. నిజాంసాగర్ మండల పరిషత్ తనిఖీ చేశారు. నాయకులు, అధికారులు కలెక్టర్ను సన్మానించారు. అనంతరం పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్ కార్యాలయాన్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ వివరాలను తహసీల్దార్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.