నిజాంసాగర్, జూలై 24 : మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, అక్కడి నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్కు తీసుకువచ్చారని తెలిపారు. జూలైలోనే నిజాంసాగర్ నీటిని విడుదల చేయడం చాలా అరుదని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సందర్భంగా ఆదివారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా మంజీరా నది, గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను సీఈ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, పర్యాటకులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. జూలై నెలలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉండడం సంతోషకరమని అన్నారు. ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగడంతో వరదగేట్ల ద్వారా నీటి విడుదల చేశారని తెలిపారు. ఆయకట్టు పరిధిలో రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. కాళేశ్వరం నీటిని మరో మార్గం మల్లన్నసాగర్, కొండెం చెరువు ద్వారా కూడా తీసుకువచ్చేందుకు పనులు మమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు కూడా 20 లక్షల ఎకరాల స్థిరీకరణలో భాగమేనని వెల్లడించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నాగమడుగు మత్తడి నిర్మాణం, జిల్లాలోని చెరువుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ వెంట సీఈలు శ్రీనివాస్, సొలోమాన్, డీఈ శ్రావణ్కుమార్, టీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మహేందర్ కుమార్, బాన్సువాడ నాయకులు ఉన్నారు.