లక్ష్యాలను సాధించేందుకు రైతులను ప్రోత్సహించాలి
ఆర్మూర్: ఇందూరు జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతాంగానికి అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖ ద్వారా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో పెంచుతున్న ఆయిల్పామ్ నర్సరీని బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా అధికారులు మాట్లాడుతూ ఇందూరు జిల్లాకు కేటాయించిన సాగు లక్ష్యాలను సాధించడం కోసం జిల్లా రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు.
వచ్చే ఏడాది వరకు ఆయిల్పామ్ మొక్కలు నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. లక్ష్యం మేరకు సాగు చేయడానికి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆయిల్పామ్ సాగు వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమ అధికారులు, ఆర్మూర్ వ్యవసాయశాఖ ఏడీఏ హరికృష్ణ, ఉద్యానవనశాఖ అధికారి విద్యాసాగర్, ఆర్మూర్ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్ఐ రఫీక్, వీఆర్ఏ తదితరులు పాల్గొన్నారు.