నస్రుల్లాబాద్, మే 4: రైస్ మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లర్లు, సొసైటీ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ధాన్యాన్ని తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండేలా వడ్లను ఎండబెట్టి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నామని తెలిపారు.
ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తే అక్కడ తరుగు పేరిట లారీకి 10 నుంచి 20 బస్తాల వరకు తరుగు తీస్తున్నారని వాపోయారు. దళారులకు అమ్మి పోసపోకూడాదని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే, సొసైటీ సిబ్బంది రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తరుగు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డీటీ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. ఘటనా స్థలానికి తహసీల్దార్ సువర్ణ చేరుకొని రైతులను సముదాయించారు. డీఎస్వో, అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తరుగు తీస్తే కఠిన చర్యలు: డీఎస్వో వెంకటేశ్వర్లు
తరుగు పేరిట కోతలు విధిస్తున్న రైస్ మిల్లర్లపై విచారణ చేపట్టి కఠిక చర్యలు తీసుకుంటామని డీఎస్వో వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తే తరుగు పేరిట లారీకి 10 నుంచి 20 బస్తాలు తీసేస్తున్నారని రైతులు డీఎస్వో దృష్టికి తీసుకెళ్లారు. చెన్ని పట్టని వడ్లకు కిలో 400గ్రాములు తరుగు మాత్రమే తీయాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. ధాన్యం బస్తాల తూకం ప్రక్రియను పరిశీలించారు. 41.400 తూకం ఉండాల్సిన బస్తాలు 43 కేజీల వరకు కాంటా వేయడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లులలోని తూకం యంత్రాలను తనిఖీలు చేయిస్తామన్నారు. విచారణ అనంతరం తరుగు పేరిట నష్టపోయిన రైతులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.