“సమైక్య రాష్ట్రంలో జుక్కల్ను వెనుకబడిన నియోజకవర్గంగా చెప్పుకొనేవారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో సుమారు రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అభివృద్ధిపై ఎలాంటి ధ్యాస లేదు. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారు. కామారెడ్డి నుంచి స్వయాన సీఎం కేసీఆరే పోటీచేస్తుండడంతో జుక్కల్ ప్రజల దశ తిరగనున్నది. ఈ నియోజకవర్గంపై సీఎంకు పూర్తి అవగాహన ఉన్నది. మున్ముందు మరిన్ని నిధులు మంజూరు చేస్తారు. 50ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని పనులను పదేండ్లలో నేను చేశాను. ప్రజల ఆశీర్వాదంతో రెట్టింపు మెజారిటీతో గెలుస్తా..” అని ధీమా వ్యక్తంచేస్తున్నారు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే. ‘నమస్తే తెలంగాణ’కు గురువారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– కామారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటీ?
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 2014లో దాదాపు రూ.2వేల కోట్ల నిధులతో రోడ్లు, దవాఖాన భవనాలు, చెరువులు, నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఆరు సబ్ స్టేషన్లు, ఇవే కాకుండా అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రాంత ప్రజలకు అందించాం. 2018 తర్వాత రూ.వెయ్యి కోట్లతో మిగిలిన గ్రామాలకు బీటీ, సీసీరోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాలకు భవనాలు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్లో వంతెనలు, రోడ్లు వేశాం. నిజాంసాగర్ సమీపంలో వంతెన, దేవాడ వంతెన, శక్తినగర్కు వంతెన నిర్మించా. ఎంపీ బీబీపాటిల్ కృషితో నర్సింగ్రావుపల్లి నుంచి మద్నూర్ వరకు జాతీయ రహదారి విస్తరించగా, ఆ రహదారికి కనెక్టింగ్ రోడ్లు వేయించా. మన ఊరు – మన బడిలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేశా.
సీఎం కేసీఆర్ పోటీ ప్రభావం ఎలా ఉండబోతున్నది?
కేసీఆర్ సార్ కామారెడ్డి జిల్లాకు రావడంతో మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నా. విద్యా, వైద్యం, రవాణా ఇలా అన్ని రంగాల్లో జుక్కల్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాబోయే ఐదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఉన్నది. కామారెడ్డి జిల్లా సైతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది.
నమస్తే : మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
హన్మంత్ షిండే : మాది జుక్కల్ మండలం డోన్గాం గ్రామం. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉండేది. 50ఏండ్లు కాంగ్రెస్ పాలించినా, ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కష్టపడి చదివి బీటెక్ చదివా. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాను. జుక్కల్ అభివృద్ధి కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయ ప్రవేశం చేశాను. టీడీపీ తరఫున 2004లో పోటీ చేసి 1200 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశాను. ఓడినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నా.
ఇప్పటి వరకు ఎన్నిసార్లు విజయం సాధించారు?
ప్రజల అండదండలతో 2009లో 34వేల భారీ మెజారిటీతో గెలిచాను. 2013 డిసెంబర్ 22నాడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నేను టీడీపీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాను. గులాబీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో 2014లో 35వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందాను. 2018లో మరోసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 36వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించాను.
మీ నియోజకవర్గంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
ప్రతిపక్షాలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్కు 50ఏండ్లు అధికారం ఇస్తే, మేము ఈ పదేండ్లలో చేసిన అభివృద్ధిలో సగం కూడా చేయలేదు. వారు 50 ఏండ్లలో వంద గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తే మేం కేవలం పదేండ్లలోనే వేశాం. 30 పడకల దవాఖానలు మూడు నిర్మించాం. 10 సబ్స్టేషన్లు కట్టాం. నాలుగు రెసిడెన్షియల్ స్కూళ్లు, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, కేజీబీవీ తదితర వాటిని ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులతో మా నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. బీజేపీనీ ఈ నియోజకవర్గంలో ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. గతంలో కన్నా గొప్ప మెజారిటీతో నా ఓటరు మహాశయులు గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం నాకున్నది.
రానున్న రోజుల్లో ఏయే అభివృద్ధి పనులు చేస్తారు?
జుక్కల్ నియోజకవర్గంలో మిగిలిన పనులను పూర్తి చేస్తాం. కౌలాస్ కోట, నిజాంసాగర్ ప్రాజెక్టు, పిట్లం రామలింగేశ్వర ఆలయం, మద్నూర్లోని మిర్జాపూర్ హన్మాన్ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. పిట్లంలో డిగ్రీ కళాశాల, బిచ్కుందలో పీజీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల సాధించడమే కాకుండా రైతుల కోసం విత్తన శుద్ధి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత రైతులు పండించిన పంటలకు సరైన ధర దక్కేలా సహకరిస్తా. ఇంటర్ కనెక్టెడ్ రోడ్లు, కుల సంఘ భవనాలు, మండల కేంద్రాల్లో సంఘాల వారీగా కల్యాణ మండపాలు నిర్మిస్తాం. బీర్కూర్ వంతెన వద్ద సంప్హౌస్ కట్టి, అక్కడ నీటిని నిల్వ చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లెండి కాల్వలకు నీరు అందిస్తాం. ఈ లిఫ్ట్ ద్వారా నియోజకవర్గంలోని 22వేల ఎకరాలకు నీరు అందుతుంది.