ఖలీల్వాడి నవంబర్ 25 : తెలంగాణ కోసం ఎన్నో రోజులు బయట తిరిగానని.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేశానని… లాఠీ దెబ్బలు తిన్నానని తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ తెలంగాణ శంకర్ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ అప్పుడు ఎట్లా ఉంది.. ఇప్పుడెట్లా మారిందో ప్రజలు గమనించాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో బీజేపీ, కాంగ్రెసోళ్లకు నిద్రపట్టడం లేదు. దోచుకోవడానికి దొంగ ఒకడు ఆంధ్ర నుంచి వచ్చాడు. మరొకడు గుజరాత్ నుంచి వచ్చాడు.. ఇలా ఎవడుపడితే వాళ్లు వచ్చి తెలంగాణను తీసుకుపోతామంటే ప్రజలు ఊరుకోరు. ఆనాడు దాశరథి ‘నా తెలంగాణ…కోటి రతనాల వీణ’ అని ఊరికే ఆనలేదు. ఆకలి బతుకులు పోయాయి. పంటలు పండి సుఖశాంతులతో ఉండే తెలంగాణని మళ్లీ నాశనం చేయడానికి వస్తున్నారు. తెలంగాణ సంక్షేమం ముందు అన్ని పార్టీలు దిగదుడుపే.
ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేశాను. ఆ సమయంలో పోలీసోళ్లు కొడితే విపరీతంగా ఏడ్చాను. తిండి తిప్పలు లేక నరకం అనుభవించా.. 5 సార్లు జైలుకు తీసుకెళ్లారు. 60 కేసులు పెట్టారు. అయినా వెనకడుగు వేయలేదు. కవితక్క చాలా సపోర్ట్ చేసింది. మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నది.
తెలంగాణలో అప్పుడెట్లుంది.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఆ విషయం బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. నిజామాబాద్ నగరం చాలా సుందరంగా తయారైంది. అభివృద్ధికి మారుపేరుగా నిజామాబాద్ నిలుస్తున్నది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఎన్ఆర్ఐ ఆయనకు పైసలతో పని లేదు. నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసమే పని చేస్తారు.
రాష్ర్టాన్ని దోచుకోవడానికి వస్తున్న గజదొంగలు
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. అధికారంలో ఉన్న నాడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా. సస్యశ్యామలంగా మారిన తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకే వస్తున్నారు. మన దగ్గర అమలవుతున్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదు. 24 గంటల కరెంట్ ఇచ్చే దమ్ములేదు. కర్ణాటకలో అమలు సాధ్యం హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. రైతుల గురించి ఆలోచన చేయనోళ్లు ఏం అభివృద్ధి చేస్తారు..
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదవారిపై భారాన్ని తగ్గించేందుకు గ్యాస్ ధరను తగ్గించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చింది. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు వస్తున్న పార్టీలను తగిన బుద్ధి చెబుతాం.