పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.
సుభాష్నగర్, మార్చి 7: ఇందూరు కంఠాభరణమైన నీలకంఠేశ్వరస్వామి ఆలయంతోపాటు ప్రసిద్ధిగాంచిన శంభులింగేశ్వరాలయం, ఉమామహేశ్వర ఆలయం, నగరేశ్వరాలయం, మనోకామేశ్వరాలయం, మార్కండేయ మందిరం, నాందేవ్వాడ సాయిబాబా, నాగారంలోని నందిగుట్ట ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి మహాన్యాస పూర్వక లింగోద్భవ నిశి పూజ కార్యక్రమం, ఉదయం నుంచి అభిషేకాలు, విశేష పూజలు, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నీలకంఠేశ్వర, శంభులింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
రామారెడ్డి, మార్చి 7: మండలంలోని మద్దికుంట అటవీ ప్రాంతం లో వెలసిన శ్రీ బుగ్గ్గరామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కల్యాణంతోపాటు మూడురోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 25 ఏండ్ల నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
భిక్కనూర్, మార్చి 7: భిక్కనూర్లోని స్వయంభూలింగం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఆలయంలో వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఆలయంలోని మూల బావి వద్ద స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుంటారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహారుద్రాభిషేకం, ఆవుపాలతోఅభిషేకాలు నిర్వహిస్తారు.
నస్రుల్లాబాద్, మార్చి 7 : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని సోమలింగేశ్వరాలయానికి 1500 ఏండ్ల ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ ఆలయాన్ని దర్శిస్తే కాశీలోని శివాలయాన్ని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సుమారు 1500ఏండ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సోమభూపాలుడనే మహారాజు పరిపాలించాడు. ఆయన పరిపాలనలో స్వయం భూ లింగంగా వెలిసిన లింగానికి సర్వాంగ సుందరంగా శిల్పకళా నైపుణ్యంతో ఆలయాన్ని నిర్మించడం విశేషం.