విద్యానగర్/రుద్రూర్ ఆగస్టు 25 : వినాయక చవితి ఉత్సవాలకు యావత్తు సిద్ధమవుతున్నది. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనపెట్టి పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామంటున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న స్పృహ అన్నివర్గాల్లో పెరిగింది. దీంతో మట్టి గణపతుల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం.వీధి వీధినా మండపాల్లో ఆకర్షణీయమైన సెట్టింగులు… భారీ విగ్రహాలు… ఉదయం నుంచి పూజలు తదితర కార్యక్రమాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటాడు. ఏటేటా ప్రతిష్ఠించే రంగురంగుల విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి ప్రతిమలే శ్రేష్ఠమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం సైతం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ప్రోత్సహిస్తున్నది. గతంలో కేవలం మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు. నేటి యువత పోటీపడి మరీ కలర్ ఫుల్ విగ్రహాలను ప్రతిష్ఠించడం ఎక్కువైంది. ఇతరుల కన్నా తమ వినాయకుడే భారీగా, ఆకర్షణీయం గా ఉండాలని ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడంలేదు. దీంతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది. పర్యావరణ ప్రేమికులు,నిపుణు లు హెచ్చరించడంతో ప్రజల్లో అవగాహన కలి గి మట్టి విగ్రహాలే మేలని భావిస్తున్నారు. చిన్నచిన్న విగ్రహాలే కాకుండా భారీ మట్టి గణపతులనే ప్రతిష్ఠించేందుకు ముందుకొస్తున్నారు.
విషపూరిత వాయువుల విడుదల…
విగ్రహాలకు వేసిన పెయింట్ ఎండే సమయం లో విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. పెయింట్లలో రంగుల కోసం వాడే కణాల్లో సాధారణంగా కాడ్మియం లేదా టైటానియంతో కూడిన పదార్థాలు ఉంటాయి. ఇవి విషపూరితమైనవే. ఆయా వాయువులు గాలిలో కలవడంతో వాయుకాలుష్యం జరిగి సకాలంలో వర్షాలు పడకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి కృత్రిమ రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాలతో దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. వీటిని చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ నీటిని తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాలుష్యపరమైన ప్లాస్టిక్లతో కాకుండా మట్టిని వినియోగించుకోవడంతో పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది.
మట్టిగణపతులకు పెరుగుతున్న ఆదరణ
ఐదేండ్ల నుంచి మట్టివిగ్రహాలకు ఆదరణ పెరుగుతున్నది. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల వారు ప్రతి ఏడాది ప్రజలకు ఇంట్లో పూజించుకునే విగ్రహాలను ఉచితంగా ఇస్తుంటారు. దీంతో గతంలో కన్నా మట్టి వినాయకులకు ఆదరణ పెరుగుతున్నది. పరిసరాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయనే భావనతో నవరాత్రుల్లో మట్టి వినాయకులనే పూజించాలనే స్పృహ ప్రజల్లో కలుగుతున్నది.
మట్టి విగ్రహాలే శ్రేష్ఠం..
మట్టిలో అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. సమస్త చరాచర జగత్తు అంతా మట్టి నుంచే ఉద్భవిస్తుంది. అందుకోసమే మట్టి విగ్రహాలు శ్రేష్ఠం. మట్టి వినాయకున్ని పూజిస్తే సమస్త మానవాళికి మేలు జరుగుతుంది. మట్టి విగ్రహాలనే పూజించమని శాస్త్రమే ఉద్బోధిస్తున్నది. వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి.
– గంగవరపు ఆంజనేయ శర్మ, వేద పురోహితుడు
పర్యావరణ హితం కోసమే..
పర్యావరణాన్ని పరిరక్షించడానికే మట్టి వినాయకులను తయారు చేస్తున్నాం. ఎలాంటి కెమికల్స్ లే కుండా బంకమట్టి, గంగ మట్టి, వెదురు బొంగులు, గడ్డితో ప్రతిమలను తయారు చేస్తున్నాం. ఐదేండ్ల నుంచి ఈ మట్టి వినాయకులను తయారు చేస్తున్నాం. వీటి ధరలు సుమారు రూ.10వేల నుంచి 20 వేల వరకు డిజైన్లు, ఆకృతుల మేరకు ఉంటాయి. ప్రస్తుతం మట్టి వినాయకులకు విశేష ఆదరణ లభిస్తున్నది.
– సంతోష్, గణపతి తయారు యజమాని