వేల్పూర్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువులు చెక్డ్యాంల కాంట్రాక్టర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆరోపణలు నిజమని నిరూపించకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆదివారం వేల్పూర్లో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రిపై ఆరోపణలు నిజమని నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని వెల్లడించారు.
మండలంలోని పచ్చలనడ్కుడ, మోతె, అక్లూర్ గ్రామాలలో పర్యటించిన ఎంపీ అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న అరవింద్కు రానున్న రోజుల్లో ప్రజలు గోరి కడుతారని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ జిల్లాకు చేసింది శూన్యమని అన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో పోటీ పడాలన్నారు. వేల్పూర్ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచటానికి, వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పెద్దవాగు, కప్పల వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు చేపిస్తే కమిషన్ల కోసమని ఆరోపించడం విడ్డురంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో రైతు సమన్వయ కమిటీ సభ్యుడు సామ మహిపాల్, రాకేశ్ చంద్ర, పచ్చలనడ్కుడ ఉపసర్పంచ్ గంగారెడ్డి, మోతె సొసైటీ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, దోళ్ల రాజేశ్వర్, వేల్పూర్ ఉపసర్పంచ్ పిట్ల సత్యం, పచ్చలనడ్కుడ ఎంపీటీసీ గూడాల గంగాధర్, బబ్బురు ప్రతాప్, ఏలేటి రమేశ్, కుమ్మరి రాజన్న తదితరులు ఉన్నారు.